టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ ఘనంగా ఆరంభించింది. న్యూయార్క్ వేదికగా నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్షదీప్ సింగ్ (2/35) సత్తాచాటారు.
అనంతరం భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (36 నాటౌట్, 26 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. గ్రూప్-ఏలో భాగంగా భారత్ తదుపరి మ్యాచ్ను ఆదివారం పాకిస్థాన్తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

జూన్ 9న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఇక్కడి డ్రాప్ ఇన్ పిచ్లపై అస్థిర బౌన్స్ లభిస్తుంది. బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అంతేగాక బ్యాటర్లకు గాయాలవుతున్నాయి. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ రిటైర్ హర్ట్గా వెనుదిరగడానికి పిచ్యే కారణం. అస్థిర బౌన్స్ వల్ల హిట్ మ్యాన్ భుజానికి గాయమైంది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని పిచ్లు చాలా ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు సైతం పేర్కొంటున్నారు. ''అమెరికాలో క్రికెట్ను ప్రోత్సహించాలని భావిస్తున్నాం, కానీ ఈ పిచ్లు ఆటగాళ్లకు ఎంతో ప్రమాదం. ఈ పిచ్ కచ్చితంగా మంచిది కాదు'' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందిస్తూ.. ''పిచ్లకు ఏమైనా చేయండి. ఇలాంటి దానిపై భారత్-పాక్ మ్యాచ్ను ఊహించుకోవడం కష్టం'' అని అన్నాడు.
అస్థిర బౌన్స్ లభిస్తూ, ఆటగాళ్లకు ప్రమాదకరంగా పిచ్ ఉంటే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఇటీవల బిగ్ బాష్ లీగ్లో ఓ మ్యాచ్ను పిచ్ కారణంగానే రద్దు చేసిన విషయం తెలిసిందే. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 6.5 ఓవర్ల అనంతరం రద్దు చేస్తూ ప్రకటించారు. భారత్-పాక్ మ్యాచ్లోనూ ఇలాంటి ఘటనే జరుగుతుందేమో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ఇప్పటివరకు ఉపయోగించని పిచ్ను ఉపయోగించనున్నారు. అది ఎలా సహకరిస్తుందో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురుచూడాల్సిందే.