టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 మ్యాచ్లు రేపటితో ముగియనున్నాయి. దీంతో సెమీఫైనల్ రేసు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-1 నుంచి ఏ జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుందా అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. భారత్ సెమీస్కు చేరడం దాదాపు ఖాయమే. కానీ గ్రూప్లో ఏ స్థానంలో ముగిస్తుందనే విషయమే ఆసక్తికరం.
సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో రోహిత్ సేన ఇవాళ సూపర్-8లో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా నెట్రన్రేటుతో సంబంధం లేకుండా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. అంతేగాక టేబుల్ టాపర్గా నిలుస్తుంది. ఆ సందర్భంలో ప్రమాదకరమైన ఇంగ్లండ్తో భారత్ సెమీఫైనల్లో పోటీపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైనా గ్రూప్-1లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగే అవకాశమూ ఉంది.

అయితే భారత్ ఘోర పరాజయాన్ని చవిచూస్తే మాత్రం రెండో స్థానానికి పడిపోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా 41 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధిస్తే టీమిండియా నెట్రన్రేటును అధిగమిస్తుంది. ఆ సందర్భంలో తొలి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో భారత్ సూపర్-8 దశను ముగిస్తుంది. ఈ క్రమంలో గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్లో పోటీపడాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఫామ్, రికార్డుల పరంగా చూస్తే భారత్కు సెమీస్లో ప్రత్యర్థిగా ఇంగ్లండ్ రాకపోవడమే మంచిది. కానీ ఆస్ట్రేలియాపై భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో సెమీస్ ఫైట్ ఇంగ్లండ్తోనే చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ జట్టులో విధ్వంసకర బ్యాటర్లకు, సమర్థులైన ఆల్రౌండర్లకు కొదవ లేదు. అంతేగాక ఆర్చర్ రాకతో పేస్ దళం కూడా బలోపేతంగా మారింది. లీగ్ స్టేజ్లో స్కాట్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఇంగ్లండ్కు ఓ దశలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్లు మోన్స్టర్స్లా చెలరేగిపోతున్నారు. ఒమన్పై 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. నిన్న అమెరికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లోనూ 116 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే అందుకుంది. అందుకే ఇటీవల ఆస్ట్రేలియా పేసర్ హేజిల్వుడ్.. ఇంగ్లండ్ను గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి పంపిస్తే అందరికీ మంచిదని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ డేంజరస్ ఇంగ్లండ్ను భారత్ సెమీస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. గత టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తోనే సెమీఫైనల్ ఆడిన టీమిండియా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.