టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 రేసు ఓ ముగింపుకు వచ్చింది. గ్రూప్-ఏ నుంచి భారత్ తుదిపరి దశకు అర్హత సాధించింది. ఇక మిగిలిన స్థానం కోసం అమెరికాతో పాకిస్థాన్ పోటీపడుతోంది. అయితే ఫ్లోరిడాలోని వాతావరణ పరిస్థితి ప్రకారం మిగిలిన గ్రూప్-ఏ మ్యాచ్లు సజావుగా జరుగుతాయనే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో పాక్ కంటే యూఎస్ఏకే సూపర్-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక గ్రూప్-బీలో అస్ట్రేలియా క్వాలిఫై అయ్యింది. మిగిలిన బెర్త్ కోసం ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్నాయి. ఒమన్పై సంచలన విజయంతో ఇంగ్లండ్ పోటీలో ముందడగు వేసింది. ఈ లెక్కన ఆసీస్తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్-8కు చేరుకునే అవకాశాలే ఎక్కువ. గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ అధికారికంగా అర్హత సాధించింది. మిగిలిన గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా తదుపరి దశకు చేరింది. సఫారీలతో పాటు బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్లు అధికంగా ఉన్నాయి.

గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరేట్ టీమ్స్తో సూపర్-8ను రెండు గ్రూప్లుగా విభజించింది. వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకునే జట్లను ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది. గ్రూప్-1లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), న్యూజిలాండ్ (C1), శ్రీలంక (D2)ను ఉంచింది. అలాగే గ్రూప్-2లో పాకిస్థాన్ (A2), ఇంగ్లండ్ (B1), వెస్టిండీస్ (C2), సౌతాఫ్రికా (D1)ను ఎంపిక చేసింది.
కానీ అనూహ్యంగా గ్రూప్-1లో C1గా భావించిన న్యూజిలాండ్, D2గా అనుకున్న శ్రీలంక లీగ్ స్టేజ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వాళ్ల స్థానంలో అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ (అంచనా)తో భారత్ సూపర్-8లో పోటీపడాల్సి వస్తుంది. లీగ్ స్టేజ్లో గ్రూప్ టేబుల్లో ఫలితాల ఆధారంగా సూపర్ పోరులు నిర్వహిస్తే ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సిన పరిస్థితి రాకపోయేది. కానీ సీడింగ్ ద్వారా ఇప్పుడు ఆసీస్తో భారత్ ఢీకొనాల్సి ఉంది. ఇక జోరు మీదున్న అఫ్గానిస్థాన్తో సూపర్-8లో టీమిండియా పోటీపడాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ షెడ్యూల్
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)