టీ20 ప్రపంచకప్కు ప్రకటించిన భారత జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. నయా ఫినిషర్గా గత కొంత కాలంగా సత్తాచాటుతున్న అతనికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. రింకూ లేకుండానే రోహిత్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెగాటోర్నీకి రింకూ ఎంపిక కాకపోవడంపై కొందరు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు.
అయితే వరల్డ్ కప్కు ప్రకటించిన భారత జట్టు గొప్పగా ఉందని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నాడు. టీ20 ప్రపంచకప్లో సూపర్-8 మ్యాచ్లు, నాకౌట్ పోరులకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్లో పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయని, రింకూ బదులుగా అదనపు స్పిన్నర్ను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమే అని దాదా తెలిపాడు.

''భారత జట్టు అద్భుతంగా ఉంది. టీమ్లో అందరూ మ్యాచ్ విన్నర్లే. రోహిత్, ద్రవిడ్ అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకున్నారు. వెస్టిండీస్లో వికెట్ స్లోగా ఉంటుంది. స్పిన్కు అనుకూలిస్తుంటుంది. దీంతో మరో స్పిన్నర్ జట్టులో ఉండాలని సెలక్టర్లు భావించి ఉంటారు. అందుకే రింకూ సింగ్కు అవకాశం దక్కలేదు. అయితే రింకూకు ఇది ఆరంభం మాత్రమే. సుదీర్ఘ కెరీర్ ఉంది'' అని గంగూలీ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవడానికి భారత్, ఆస్ట్రేలియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని గంగూలీ చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఇండియా, ఆసీస్ పొట్టి కప్లోనూ సత్తాచాటుతాయని తెలిపాడు. ''టోర్నమెంట్లో భారత్, ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్లు. యూఎస్ఏ, వెస్టిండీస్లో కూడా ఈ రెండు జట్లు అదే తరహా ప్రదర్శన చేస్తాయి'' అని గంగూలీ పేర్కొన్నాడు. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్కు యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.