అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్లో జరగనుంది. వన్డే ప్రపంచకప్ను చేజార్చుకున్న టీమిండియా ఈ సారి పొట్టికప్ను అందుకోవాలని కసిగా ఉంది. దానికి తగ్గట్టుగానే సెలక్టర్లు టీ20 ప్రపంచకప్ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని తిరిగి టీ20 ఫార్మాట్కు ఎంపిక చేశారు.
జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే చివరి టీ20 సిరీస్ ఇదే. అయితే ఈ సిరీస్కు కొందరు ప్లేయర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మరికొందరు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకొని పేసర్లు బుమ్రా, సిరాజ్కు విశ్రాంతి ఇచ్చారు.

హార్దిక్ పాండ్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమి, రుతురాజ్ గైక్వాడ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్కు విశ్రాంతి ఇచ్చారా? పక్కనపెట్టారా ? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హార్దిక్, సూర్యకుమార్ జట్టులోకి తిరిగొస్తే యువ ప్లేయర్లు రింకూ సింగ్, తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ దాస్ గుప్తా పేర్కొన్నాడు.
'' రోహిత్, కోహ్లిని తిరిగి టీ20లకు ఎంపిక చేయడంపై కాస్త ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే గత టీ20 ప్రపంచకప్లో సీనియర్ ప్లేయర్లు స్థానాలపై విమర్శలు వచ్చాయి. కానీ మరోసారి సీనియర్లు జట్టులో ఉండాలని ఎంపిక చేశారు. వెస్టిండీస్లో 180-200 రన్స్ చేసే వికెట్ను ఆశిస్తున్నారా? లేదా 160 పరుగుల పిచ్ ఉంటుందని భావిస్తున్నారా? రోహిత్, కోహ్లిని తిరిగి ఎంపిక చేయడంతో మనం మళ్లీ మొదటికి వచ్చినట్లు ఉంది. అయితే వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది.''

''అయితే టీ20 ప్రపంచకప్లో మూడో స్థానంలో కోహ్లి, తర్వాత సూర్యకుమార్, హార్దిక్ బ్యాటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయిదో స్థానంలో జితేశ్ శర్మ లేదా సంజు శాంసన్కు అవకాశం దక్కుతుంది. టాప్ ఆర్డర్ ప్లేయర్లు ఎంతో మంది అందుబాటులో ఉంటారు. కానీ ఏడు, ఎనిమిది స్థానాల్లో సత్తా చాటే బ్యాటింగ్ ప్లేయర్లు తక్కువగా ఉంటారు''
''రింకూ సింగ్, తిలక్ వర్మ అప్గానిస్థాన్ సిరీస్లో ఆడతారు. కానీ వారిద్దరు ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోవచ్చు. వారిద్దరు గొప్ప ప్రదర్శనలు చేశారు. కానీ హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ తిరిగివచ్చిన తర్వాత రింకూ, తిలక్ జట్టులో చోటు కోల్పోతారు'' అని దాస్గుప్తా తెలిపాడు. మిడిలార్డర్లో ఎటాకింగ్ ప్లేయర్గా తిలక్ వర్మ, నయా ఫినిషర్గా రింకూ సింగ్ సత్తాచాటుతున్న విషయం తెలిసిందే.