డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయింది. టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఇంటిముఖం పట్టింది. గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్ చేతిలో 68 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు), బట్లర్ (23; 15 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్లు. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు. అయితే భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూడటంతో కృంగిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొన్నిరోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
'' ఓటమి ఎంతో నిరుత్సాహపరిచింది. భారత్ చేతిలో దారుణంగా చిత్తయ్యాం. విజయానికి టీమిండియా పూర్తి అర్హులు. ఈ పిచ్పై 140-150 పరుగులకు కట్టడిచేయాలనుకున్నాం. కానీ వాళ్లు ఎక్కువ స్కోరు సాధించారు. ఇక్కడ ఛేదన చేయడం అంత సులువు కాదు. నిజాయతీగా చెప్పాలంటే.. కొన్నిరోజులు ఆటకు దూరం అవ్వాలనుకుంటున్నాను. ఓటమి అనంతరం ఎంతో భావోద్వేగానికి గురవుతున్నాను. ప్రస్తుతం దాని గురించి లోతుగా వెళ్లాలనుకోవట్లేదు. ఆట నుంచి కాస్త విరామం కావాలనిపిస్తుంది'' అని బట్లర్ అన్నాడు.
ఓటమి ప్రభావంతో జట్టులో ఎలాంటి మార్పులు చేయట్లేదని బట్లర్ స్పష్టం చేశాడు. తమ జట్టులో ప్రతిభావంతులు ఉన్నారని, కానీ అత్యున్నత ప్రదర్శన చేయలేకపోవడంతో పరాజయాన్ని చవిచూశామని తెలిపాడు. బలమైన జట్టు అయిన భారత్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం, తుదిజట్టు ఎంపిక ఓటమికి కారణాలుగా భావించట్లేదని బట్లర్ చెప్పాడు. ఎలాంటి పరిస్థితికి అయినా సిద్ధపడి భారత్ బరిలోకి దిగిందని, మెరుగైన ప్రదర్శన చేసి గెలిచిందని అన్నాడు.