ప్రపంచకప్లో సెమీఫైనల్స్ గండాన్ని దక్షిణాఫ్రికా తొలిసారి అధిగమించింది. ట్రిండాడ్ వేదికగా గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. వరల్డ్ కప్ చరిత్రలో ప్రొటీస్కు ఇదే తొలి టైటిల్ పోరు. మండకొడి పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది.
దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు వణికిపోయారు. వరల్డ్ కప్ సెమీఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అఫ్గానిస్థాన్ కోరుకోని రికార్డు సాధించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్లో ఎక్స్ట్రా రూపంలో వచ్చిన 13 పరుగులే వ్యక్తిగత స్కోరుల కంటే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆదిలోనే డికాక్ (5; 8 బంతుల్లో, 1 ఫోర్) ఔటైనా రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్క్రమ్ (23 నాటౌట్; 21 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు.
కాగా, మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. సమష్టి పోరాటంతోనే ఫైనల్కు చేరుకున్నామని తెలిపాడు. టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేవాళ్లమో తెలియదని అన్నాడు. పిచ్ బ్యాటింగ్కు చాలా కఠినంగా ఉందని పేర్కొన్నాడు.
''కెప్టెన్గా ఇక్కడ వరకు చేరుకోలేదు. ఇది జట్టుగా సాధించిన సమష్టి విజయం. ఎంతో మంది ఆటగాళ్ల కృషితో గెలిచాం. అయితే అదృష్టవశాత్తు టాస్ ఓడిపోయాం. లేదంటే బ్యాటింగ్ తీసుకునేవాళ్లం. ఇక బంతితో అద్భుత ప్రదర్శన చేశాం. సరైన ప్రదేశాల్లో వేస్తూ సత్ఫలితాన్ని సాధించాం. ఛేదనలో కాస్త అదృష్టం కూడా రావడంతో భాగస్వామ్యాన్ని నిర్మించాం. మొత్తంగా విజయం సాధించినందకు సంతోషంగా ఉన్నాం. ఇక టైటిల్కు మరో అడుగు మిగిలి ఉంది. మునుపెన్నడూ ఈ అవకాశం రాలేదు. దీని గురించి భయపడాల్సిన పనిలేదు'' అని మార్క్రమ్ అన్నాడు.