ఇంగ్లండ్పై విజయం సాధించి సూపర్-8లో ఘనంగా బోణీ చేద్దామనుకున్న వెస్టిండీస్కు నిరాశే మిగిలింది. సెయింట్ లూసియా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో తమ వరుస ఎనిమిది విజయాలకు బ్రేక్ పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (38; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
కెప్టెన్ పావెల్ (36; 17 బంతుల్లో, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. జానీ బెయిర్స్టో (48 నాటౌట్; 26 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అయితే వెస్టిండీస్తో టీ20 మ్యాచ్ అంటే ఫిలిప్ సాల్ట్ పూనకం వచ్చినట్లు ఊగిపోతాడు. విండీస్పై అతడు సగటును నాలుగు బంతులకో బౌండరీ సాధిస్తాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 68 సగటు, 186 స్ట్రైక్రేటుతో వెస్టిండీస్పై 478 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. టీ20ల్లో వెస్టిండీస్పై అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్గా ఫిలిప్ సాల్ట్ రికార్డు నెలకొల్పాడు.
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ మాట్లాడుతూ.. తమ జట్టు పరాజయానికి సాల్ట్ ప్రధాన కారణమని అన్నాడు. ప్రతిసారి తమ జట్టుకు సాల్ట్ బాధ కలిగిస్తున్నాడని తెలిపాడు. ''బ్యాటింగ్ పరంగా మేం 15-20 పరుగులు తక్కువగా చేశాం. ఆఖరి అయిదు ఓవర్లలో మా పూర్తి సామర్థ్యంతో బ్యాటింగ్ చేయలేకపోయాం. ఈ విషయంలో ఇంగ్లండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు గొప్పగా బౌలింగ్ చేశారు''
''సాల్ట్ ఎల్లప్పుడూ మాకు బాధ మిగులుస్తున్నాడు. వెస్టిండీస్పై అతడు అలా ఆడటం కష్టతరంగా ఉంది. సాల్ట్పై మా ప్రణాళికలు అమలు చేయలేకపోతున్నాం. ఇక మా భవిష్యత్ మా చేతుల్లోనే ఉంది. గొప్ప విజయాలు సాధించాలి. మంచి క్రికెట్ ఆడాలి. బ్రాండన్ గాయం గురించి కాస్త ఆందోళన చెందుతున్నాం. తర్వాతి మ్యాచ్లో అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం'' అని పావెల్ పేర్కొన్నాడు.