టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. బార్డడోస్ వేదికగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో చివరి అయిదు వికెట్లను ఆరు బంతుల్లో పడగొట్టారు. క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్తో సహా నాలుగు వికెట్లు తీసి రికార్డులు బ్రేక్ చేశాడు. 115/5 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా పరుగులేమి చేయకుండా తమ చివరి అయిదు వికెట్లు కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అమెరికాన 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ (30; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (4/10) నాలుగు, ఆదిల్ రషీద్ (2/13), సామ్ కరన్ (2/23) చెరో రెండు వికెట్లు తీశారు. యూఎస్ఏకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ (8; 5 బంతుల్లో, 1 సిక్సర్)ను టోప్లే ఔట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన నితీశ్తో కలిసి స్టీవన్ టేలర్ (12; 13 బంతుల్లో, 2 ఫోర్లు) నిలకడగా ఆడటంతో అమెరికా పవర్ప్లేలో 48 పరుగులు చేసింది.

కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీయడంతో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే కోరి ఆండర్సన్ (29; 28 బంతుల్లో, 1 సిక్సర్)తో కలిసి హర్మీత్ సింగ్ (21; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) కుదురుకోవడంతో అమెరికా 115/5తో మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. కానీ 18వ ఆఖరి బంతితో అమెరికా కథ మారిపోయింది. 18 ఓవర్లో చివరి బంతికి హర్మీత్ సింగ్ను సామ్ కరన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతి అందుకున్న క్రిస్ జోర్డాన్ చెలరేగాడు.
క్రిస్ జోర్డాన్ తొలి బంతికి అండర్సన్ను ఔట్ చేశాడు. రెండో బంతికి పరుగు ఇవ్వలేదు. ఆ తర్వాత వరుసగా అలీఖాన్, నోషుతుస్, సౌరభ్ నేత్రావల్కర్ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో 115/5తో ఉన్న అమెరికా 115 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఒకే స్కోరు వద్ద అయిదు వికెట్లు కోల్పోయిన మూడు జట్టు అమెరికా కోరుకోని రికార్డు నమోదుచేసుకుంది. అంతకుముందు పాకిస్థాన్పై ఆస్ట్రేలియా, కెన్యాపై మాలి పరుగులేమి చేయకుండా అయిదు వికెట్లు కోల్పోయింది. మరోవైపు క్రిస్ జోర్డాన్ ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు.