టీ20 వరల్డ్ కప్-2024లో ఇంగ్లండ్ సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. బార్బడోస్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో అమెరికాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు దూసుకెళ్లింది. గ్రూప్-2లో ఉన్న ఇంగ్లండ్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవడంతో మిగిలి ఉన్న స్థానం కోసం రేపు వెస్టిండీస్- దక్షిణాఫ్రికా అమీతుమి తేల్చుకోనున్నాయి. మరోవైపు అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ (30; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (4/10) నాలుగు, ఆదిల్ రషీద్ (2/13), సామ్ కరన్ (2/23) చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్తో సహా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. అతడి దెబ్బకి 115/5తో ఉన్న యూఎస్ఏ ఆ తర్వాత పరుగులేమి చేయకుండా 115 వద్దే ఆలౌటైంది.

అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లో అజేయంగా 83 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా ఫిలిప్ సాల్ట్ (25 నాటౌట్; 21 బంతుల్లో, 2 ఫోర్లు) నిలిచాడు. ఛేజింగ్లో తొలి రెండు ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 6/0 మాత్రమే.
కానీ ఆ తర్వాత బట్లర్ ఊచకోత మొదలుపెట్టాడు. సౌరభ్ వేసిన మూడో ఓవర్లో వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు బాది 19 పరుగులు రాబట్టుకున్నాడు. బట్లర్ అదే జోరు కొనసాగించడంతో ఇంగ్లండ్ పవర్ప్లేలో 60 పరుగులు చేసింది. అనంతరం సాల్ట్తో కలిసి బట్లర్ నెమ్మదించాడు. 8వ ఓవర్లో మరోసారి శివమెత్తాడు. హర్మీత్ సింగ్ బౌలింగ్లో అయిదు సిక్సర్లు బాది ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో వాన్ బౌలింగ్లో బట్లర్ బౌండరీ బాది జట్టును గెలిపించాడు.