IND vs SA T20 WC 2024: టీ20 వరల్డ్ కప్లో మహా సమరానికి వేళైంది. బార్బడోస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 13 ఏళ్లుగా అందినట్లే అందుతూ దూరమవుతున్న ప్రపంచకప్ను ఈసారి తప్పక దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రపంచకప్ ఫైనల్కు తొలిసారి అర్హత సాధించిన దక్షిణాఫ్రికా.. ఈసారైనా కన్నీళ్లతో కాకుండా ఆనందభాష్ఫాలతో మైదానాన్ని వీడాలని కసితో ఆడనుంది.
అయితే ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. భారత తుది జట్టులో ఎవరుంటారనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఓపెనర్గా విఫలమవుతున్న విరాట్ కోహ్లి తుదిజట్టులో ఉంటాడా? ఓపెనర్గా లేదా వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తాడా? శివమ్ దూబె స్థానంలో సంజు శాంసన్ లేదా యశస్వీ జైస్వాల్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ మెగాటోర్నీలో కోహ్లి, దూబె నిరాశపరిచారు.

ఫైనల్లో బలమైన సౌతాఫ్రికాను ఓడించాలంటే అత్యుత్తమ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడా లేదా అదే జట్టు కొనసాగిస్తాడా అనేది అసలు ప్రశ్న. అయితే ఫామ్లో లేకపోయినప్పటికీ విరాట్ కోహ్లిని ఫైనల్ తుదిజట్టులో కొనసాగించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సూచించాడు. అంతేగాక కోహ్లి ఓపెనర్గా కంటిన్యూ అవ్వాలని చెప్పాడు.
''విరాట్ కోహ్లి గురించి చర్చ అనవసరం. అతడు లైఫ్ టైమ్ ప్లేయర్. కోహ్లి ఓపెనర్గానే కొనసాగాలి. ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్లో అతడు 700+ పరుగులు సాధించాడు. అతను కూడా మనిషే. కొన్నిసార్లు అతను కూడా ఫెయిల్ అవుతాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారత క్రికెట్కు కోహ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లాంటి వారు ఇన్స్టిట్యూషన్స్ వంటి వాళ్లు. మూడు-నాలుగు మ్యాచ్లు వాళ్లని బలహీనులుగా చేయలేవు. ఫైనల్ మ్యాచ్లో కోహ్లిని జట్టు నుంచి తప్పించవద్దు'' అని గంగూలీ అన్నాడు.

భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా