టీ20 వరల్డ్ కప్-2024లో తమ ప్రయాణాన్ని పాకిస్థాన్ విజయంతో ముగించింది. గత పొట్టి కప్లో రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్ ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. అమెరికా చేతిలో అనూహ్య ఓటమి, భారత్తో జరిగిన పోరులో ఘోరపరాజయాన్ని చవిచూడటంతో సూపర్-8కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తదుపరి దశకు తమ జట్టు క్వాలిఫై కాకపోవడానికి గల కారణాలను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ వివరించాడు.
ఆదివారం ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (31; 19 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాహిన్ అఫ్రిది (3/22) మూడు వికెట్లతో సత్తాచాటాడు. మహ్మద్ అమీర్ (2/11) రెండు వికెట్లు తీశాడు.

అనంతర ఛేదనలో పాకిస్థాన్ 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. అయితే పాకిస్థాన్ ఛేజింగ్ ఆసక్తికంగా సాగింది. ఓ దశలో పాక్ 52/2తో మెరుగైన స్థితిలో ఉన్న పాక్ అనూహ్యంగా 62/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ అబ్బాస్ అఫ్రిది (17; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), షాహిన్ అఫ్రిది (13 నాటౌట్; 5 బంతుల్లో, 2 సిక్సర్లు)తో కలిసి బాబర అజామ్ (32 నాటౌట్, 34 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఐర్లాండ్పై విజయానంతరం మాట్లాడుతూ బాబర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్ల ఘోర వైఫల్యమే తమ కొంపముంచిందని పేర్కొన్నాడు.'' గొప్పగా ముగించాం. ఆదిలోనే ప్రత్యర్థి వికెట్లు తీశాం. అయితే బ్యాటింగ్లో పూర్తి సామర్థ్యంతో రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. కానీ టెయిలెండర్ల సహకారంతో అంతిమంగా గెలిచాం. ఇక్కడి పరిస్థితులు మా బౌలర్లకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్తో జరిగిన మ్యాచ్ల్లో బ్యాటింగ్ విభాగంలో తప్పిదాలు చేశాం''
''క్రమంగా వికెట్లు కోల్పోతుంటే జట్టు ఒత్తిడిలోకి వెళ్తుంటుంది. మా జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు. ఇక మేం ఇంటికి వెళ్లి మా ప్రదర్శన గురించి సమీక్షించుకుంటాం. ఏ విభాగాల్లో పుంజుకోవాలో చూస్తాం. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లను ఘనంగా ముగించలేకపోయాం. ఓ జట్టుగా మేం విఫలమయ్యాం'' అని బాబర్ అజామ్ అన్నాడు.