
ముంబై: యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భారత జట్టుకు మెంటర్గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. అయితే మెంటర్గా ధోనీని నియమించడంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు అందింది. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మహీ నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సీఏ) మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఓ లేఖ రాశాడు.
లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఓ వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా బీసీసీఐని స్పష్టత కోరారు. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ తమ లీగల్ టీమ్ను సంప్రదించాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఎంఎస్ ధోనీ ఇప్పటికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా టీమిండియాకు మెంటర్గా కూడా ఎంపిక కావడంతో అసలు సమస్య వచ్చింది. ఈ విషయంపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. రెండు ఐసీసీ ప్రపంచకప్లు గెలిచిన ఎంఎస్ ధోనీ అనుభవం టీమిండియాకు కలిసోస్త్తుందనే ఉద్దేశంతోనే మెంటార్గా నియమించినట్లు వివరణ ఇచ్చారు.
బుధవారం టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన సందర్భంగా.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని టీమిండియాకు మెంటార్గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టించిన ధోనీని మెంటార్గా నియమించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. మాజీలు అందరూ మహీ నియామకం సరైందే అని పేర్కొన్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన ఏకైక కెప్టెన్గా ధోనీ రికార్దు నెలకొల్పాడు. మహీ సారథ్యంలోనే భారత్ 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
సంజీవ్ గుప్తా గతంలో కూడా భారత ఆటగాళ్లపై ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదులు చాలానే చేశారు. భారత దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎదుర్కున్నారు. ఐపీఎల్ టోర్నీ విషయంలోనే వీరందరిపై అప్పట్లో సంజీవ్ గుప్తానే ఫిర్యాదు చేశారు. కొందరు విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఎంఎస్ ధోనీ వంతు వచ్చింది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మహీ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటాడన్న విషయం తెలిసిందే.
ఎంఎస్ ధోనీని మెంటార్గా నియమించడంపై మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఎంఎస్ ధోనీని మెంటార్గా నియమించడం టీమిండియాకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. క్రికెట్లో అతనికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడే రోజుల్లో మహీని మించిన విధ్వంసకర ప్లేయర్ లేడు. మెంటార్గా అతని నియామకం భారత్ జట్టుకి గుడ్న్యూస్. కానీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ధోనీ మధ్య గొడవలు జరగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ధోనీ, రవిశాస్త్రి ఒకే తరహా ఆలోచన సరళిలో ఉంటే.. భారత్కి ఇది బిగ్ న్యూస్ అవుతుంది' అని సన్నీ పేర్కొన్నాడు.