సెయింట్ లూసియా వేదికగా గురువారం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (38; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. పావెల్ (36; 17 బంతుల్లో, 5 సిక్సర్లు), రూథర్ఫర్డ్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) దూకుడుగా ఆడారు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, ఆర్చర్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు.
అయితే వెస్టిండీస్కు దక్కిన శుభారంభానికి భారీ స్కోరు సాధించాల్సింది. ఓ దశలో 10 ఓవర్లకు విండీస్ 82/0 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, వెస్టిండీస్ బ్యాటర్లు అతిగా డాట్ బాల్స్ ఆడటంతో స్కోరు తగ్గింది. ఈ మ్యాచ్లో 51 బంతులు డాట్బాల్స్గా నమోదయ్యాయి. వెస్టిండీస్ 180 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన సందర్భాల్లో అత్యంత ఎక్కువ డాట్ బాల్స్ నమోదైన పోరు ఇదే. అంతకుముందు 2016లో భారత్పై 196/3 స్కోరు సాధించిన మ్యాచ్లో 50 బంతులకు విండీస్ హిట్టర్లు పరుగులేమి చేయలేదు.

కాగా, ఈ మ్యాచ్లో అత్యధిక డాట్ బాల్స్ ఆడినప్పటికీ వెస్టిండీస్ బ్యాటర్లు కళ్లుచెదిరే సిక్సర్లతో హోరెత్తించారు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (23; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఓ సిక్సర్ను ఏకంగా స్టేడియం బయటకు పంపించాడు. టోప్లే వేసిన మూడో ఓవర్ మూడో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా బ్రాండన్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అంతకుముందే బ్రాండన్ కింగ్ బ్యాటు ఛేంజ్ చేయడం గమనార్హం.
అయితే స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన బ్రాండన్ కింగ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి షాట్కు యత్నించి గాయపడ్డాడు. గజ్జల్లో గాయంతో మైదానంలో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ బ్రాండన్ నొప్పిని తట్టుకోలేకపోయాడు. దీంతో మైదానాన్ని వీడాడు. బ్రాండన్ కింగ్ కాసేపు క్రీజులో ఉంటే ఇంగ్లండ్కు వెస్టిండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించేది.