మరికొన్ని రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు భారత జట్టును సెలక్టర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచిన నేపథ్యంలో జట్టుకూర్పు గురించి టీమిండియా సెలక్టర్లు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, యువ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ జట్టు రేసులోకి వచ్చారు. చాహల్ టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది.
గాయం నుంచి కోలుకుని కుల్దీప్ యాదవ్ తిరిగిరావడం, యువస్పిన్నర్ రవిబిష్ణోయ్కు అవకాశాలు ఇవ్వడంతో చాహల్ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఈ సీజన్లో చాహల్ వికెట్లు తీస్తూ సత్తాచాటడంతో అతని పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. అయితే చాహల్కు అక్షర్ పటేల్ నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు చాహల్, అక్షర్ పటేల్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు.

మహ్మద్ షమి గాయంతో దూరమవ్వడంతో జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్లకు పేస్ బాధ్యతలు అందివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో పాటు మయాంక్ యాదవ్ను కూడా ఓ ఆప్షన్గా సెలక్టర్లు పరిగణిస్తున్నారు. అయితే మయాంక్ యాదవ్ గాయాన్ని, ఈ సీజన్లో అతని మొత్తం ప్రదర్శన పరిశీలించి తుదినిర్ణయాన్ని తీసుకోనున్నారు.
రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభించడానికి యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ను ఎంపిక చేయనున్నారు. వన్డౌన్లో విరాట్ కోహ్లిని కన్ఫార్మ్ చేశారు. కోహ్లి విషయంలో స్ట్రైక్రేటు, స్లో ఇన్నింగ్స్ వంటి కారణాలను సెలక్టర్లు పట్టించుకోవట్లేదని సమాచారం. టీమ్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ప్లేస్ ఫిక్స్ అయ్యింది. అయితే రిషభ్ పంత్ను ప్రధాన వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదానికి గురై 16 నెలలు పాటు ఆటకు దూరమైన పంత్ ఐపీఎల్తో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు అర్ధశతకాలు సాధించి ఆకట్టుకున్నాడు.
దీంతో పంత్ను ప్రధాన వికెట్కీపర్గా ఎంపికచేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో తర్వాత జరగనున్న మ్యాచ్ల్లో దారుణమైన స్కోర్లు సాధిస్తే పంత్ను సెకండ్ ఛాయిస్గా సెలక్ట్ చేయనున్నారు. మొత్తంగా పంత్ రాక నలుగురు వికెట్ కీపర్లపై ప్రభావం చూపించింది. సంజు శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. ప్రపంచకప్కు భారత జట్టును మే మొదటి వారంలో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.