హైదరాబాద్: అంధుల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పైనల్స్లో దాయాది దేశమైన పాకిస్థాన్పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది.
అంతకుముందు 2012 టోర్నీలోనూ భారత ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి మొట్టమొదటిసారి వరల్డ్కప్ను సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగుల చేసింది. పాక్ బ్యాట్స్మెన్లలో బాదర్ మునీర్ (57) అర్ధసెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో అజయ్ కుమార్ రెడ్డి, సునీల్కు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం 198 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసి విశ్వవిజేతగా అవతరించింది. దీంతో లీగ్ దశలో పాక్ చేతిలో ఓటమికి భారత ప్రతీకారం తీర్చుకుంది.

భారత్ బ్యాట్స్మెన్లలో ప్రకాశ్ జయరామయ్య (60 బంతుల్లో 15 ఫోర్లతో 99 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ అజయ్ కుమార్(43)తో కలిసి ప్రకాశ్ సాధికారిక ఇన్నింగ్స్కు తెరలేపాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అజయ్ రనౌట్గా వెనుదిరిగాడు. అయినా ప్రకాశ్ తన బ్యాటింగ్ జోరును మాత్రం ఎక్కడా తగ్గించలేదు. తన ఇన్నింగ్స్లో 15 ఫోర్లతో ఆకట్టుకున్న ప్రకాశ్.. కేతన్తో జోడీగా టీమిండియా విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేతన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో రాణించిన ప్రకాశ్ జయరామయ్యకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. కాగా, ఈ టోర్నీలో టాప్ స్కోరర్ బాదర్ మునీర్ (570) 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్తాన్: 20 ఓవర్లలో 197/8 (మునీర్ 57, జమీల్ 24, కేతన్ పటేల్ 2/29, జాఫర్ ఇక్బాల్ 2/33, అజయ్ కుమార్ 1/39);
భారత్: 17.4 ఓవర్లలో 200/1 (ప్రకాశ్ 99 నాటౌట్, అజయ్ కుమార్ 43, కేతన్ పటేల్26).