రానున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి టీమిండియాను బీసీసీఐ ప్రకటించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 27 లేదా 28వ తేదీన అధికారికంగా బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే 15 మందిలో పది మంది ఆటగాళ్ల పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్, సర్జరీల అనంతరం తిరిగి ఫిట్నెస్ పొందిన హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో స్థానం దక్కించుకున్నారని సమాచారం. బుమ్రాతో పాటు పేస్ బాధ్యతలను సిరాజ్, అర్షదీప్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ జట్టులో ఎంపికయ్యారు. మిగిలిన అయిదు స్థానాల ఎంపిక కోసం సెలక్టర్లు చర్యలు మొదలుపెట్టారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సెలక్ట్ చేయాలనే యోచనలో ఉన్నారు.
అయితే పేర్కొన్న పది మందిలో శివమ్ దూబె, రింకూ సింగ్ మిస్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ పేర్లు కూడా ఖరారు చేయలేదు. మిగిలిన అయిదు స్థానాల్లో నలుగురు బ్యాటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఎంపిక చేయరు. బ్యాకప్గా కనీసం ఓ వికెట్ కీపర్, ఇద్దరు బ్యాటర్లు, ఇద్దరు బౌలర్లు ఉండేలా జట్టును ఎంచుకుంటారు. ఈ క్రమంలో దూబె/రింకూలలో , అలాగే జైస్వాల్/గిల్లలో ఒకరికి మాత్రమే అవకాశం వచ్చే పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఫామ్లో ఉన్న శివమ్ దూబె కోసం రింకూ సింగ్పై వేటు వేసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక హార్దిక్ పాండ్య రాకతో తుది జట్టు కూర్పు కూడా రింకూకు ఎదురుదెబ్బగా మారింది. సూర్యకుమార్, పంత్ కన్ఫార్మ్ కావడంతో తుదిజట్టులో మిగిలిన రెండు స్థానాల బ్యాటర్ల కోసం దూబె, హార్దిక్ నుంచి రింకూకు తీవ్ర పోటీ ఎదురవుతోంది.
కాగా, జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ యూఎస్ఏలో, ఆ తర్వాత దశ పోరులన్నీ కరేబియన్లో దీవుల్లో జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్ పోరుతో టీమిండియా మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 9న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.