టీ20 వరల్డ్ కప్-2024లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప స్కోరులు నమోదైన ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక (47; 28 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
ఆరంభంలోనే లంక వికెట్లు కోల్పోయినా పవర్ప్లేలో 53 పరుగులు సాధించింది. కానీ అదే జోరును ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు క్రమంగా వికెట్లు సాధిస్తూ శ్రీలంక బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. బంగ్లా బౌలర్ల ధాటికి చివరి ఎనిమిది ఓవర్లలో లంక కేవలం ఒకే బౌండరీ మాత్రమే సాధించడం గమనార్హం. ఆదిలోనే కుశాల్ మెండిస్ (10; 8 బంతుల్లో, 2 ఫోర్లు), కామిందు మెండిస్ (4; 5 బంతుల్లో) ఔటైనప్పటికీ నిస్సాంక స్కోరుబోర్డు దూకుడుగా నడిపించాడు.

నిస్సాంక క్రీజులో ఉన్నంతసేపు లంక స్కోరు జోరు మీద ఉంది. 8 ఓవర్లకు 64/2 స్కోరు సాధించింది. కానీ నిస్సాంక ఔటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి అయిదు ఓవర్లలో శ్రీలంక 24 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్, రిషద్ హొస్సేన్ చెరో మూడు, తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

అయితే బంగ్లాదేశ్ ఛేజింగ్ సాఫీగా సాగలేదు. నువాన్ తుషార్ (4/18) ధాటికి 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన బంగ్లాను తౌహిద్ (40; 20 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), లిటన్ దాస్ (36; 38 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 63 పరుగులు జోడించారు. కాగా, లంక బౌలర్లు గొప్పగా పుంజుకుని వికెట్లు పడగొడుతూ తిరిగి పోటీలోకి వచ్చారు. కానీ మహ్మదుల్లా (16 నాటౌట్, 13 బంతుల్లో, 1 సిక్సర్) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాను గెలిపించాడు.