టీ20 వరల్డ్ కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికాతో పాటు తదుపరి దశకు క్వాలిఫై అయ్యింది. కింగ్స్ టౌన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత అందుకుంది. యువ బౌలర్ తన్జీమ్ హసన్ సకిబ్ (4/7) నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఓవర్లు మెయిడిన్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
మొదట బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్ హసన్ (17; 22 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. సోంపాల్ (2/10), సందీప్ లమిచానె (2/17), రోహిత్ పాడెల్ (2/20), దీపేంద్ర సింగ్ (2/22) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడిన బంగ్లాదేశ్కు పేలవారంభం దక్కింది. ఇన్నింగ్స్ తొలి బంతికే తన్జిద్ హసన్ ఔటయ్యాడు. సోంపాల్ బౌలింగ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. నేపాల్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు.

30 పరుగులకే బంగ్లాదేశ్ కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకిబ్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ నేపాల్ బౌలర్లు చెలరేగడంతో క్రమంగా వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లు రిషాద్ (13; 7 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), తస్కిన్ అహ్మద్ (12 నాటౌట్; 15 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. తన్జీమ్ (4/7) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మన్ (3/7) మూడు వికెట్లతో విజృంభించారు.
తన్జీమ్ ధాటికి నేపాల్ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. 26 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఏడు ఓవర్లలోపే తన నాలుగు ఓవర్ల స్పెల్ పూర్తిచేసిన తన్జీమ్ ఏకంగా 21 బంతుల్ని డాట్ చేశాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చి కీలక నాలుగు వికెట్లు పడగొట్టాడు. తన్జీమ్తో పాటు ముస్తాఫిజుర్ కూడా వికెట్ల వేట మొదలుపెట్టడంతో నేపాల్ ఓటమి ఖరారైంది.
కుశాల్ మల్ల (27; 40 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), దీపేంద్ర సింగ్ (25; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది. నేపాల్ బ్యాటర్లలో అయిదుగురు ఖాతా తెరవలేదు. ఇద్దరు బ్యాటర్లు ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. షకిబ్ రెండు వికెట్లు పడగొట్టాడు.