టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, గ్రూప్-సీలో అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా తదుపరి దశకు అర్హత సాధించాయి. ఇక మిగిలిన బెర్తుల కోసం పోటీ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే గ్రూప్-డీలో శ్రీలంకను బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నాకౌట్ చేసింది.
నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ విజయం సాధించడంతో శ్రీలంక సూపర్-8 ఆశలు ఆవిరి అయ్యాయి. కింగ్స్టౌన్ వేదికగా గురువారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 25 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 159 పరుగులు చేసింది. షకిబ్ అల్ హసన్ (64 నాటౌట్, 46 బంతుల్లో, 9 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్, వాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. సిబ్రాండ్ (33; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ రెండు వికెట్లు తీశారు. అయితే ఈ విజయంతో బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లకు చేరుకుంది. +0.478 నెట్రన్రేటుతో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడింట్లో గెలిచిన దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. మరోవైపు శ్రీలంక ఒక్క పాయింట్తో టేబుల్ అట్టడుగన నిలిచింది.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో లంక ఓటమిపాలైంది. వర్షం కారణంగా నేపాల్తో జరిగే మ్యాచ్ రద్దయింది. అయితే ఒక్క పాయింటే సాధించినప్పటీక బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మ్యాచ్ ముందు వరకు సూపర్-8 క్వాలిఫైపై శ్రీలంక ఆశతోనే ఉంది. బంగ్లాదేశ్ మిగిలిన మ్యాచ్ల్లో ఓడి, నెదర్లాండ్స్పై గెలిచి తదుపరి దశకు చేరుకుందామనుకుంది. కానీ నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ గెలవడంతో సమీకరణాలు తారుమారయ్యాయి. లంక చివరి మ్యాచ్లో గెలిచినా గరిష్ఠంగా మూడు పాయింట్లతో లీగ్ దశను ముగుస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ మూడు పాయింట్లు అధిగమించడంతో శ్రీలంక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.