టీ20 వరల్డ్ కప్లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్లో తమ జట్టు తొలి మ్యాచ్లో ఓటిమిపాలైనప్పటికీ బాబర్ అరుదైన ఘనత సాధించాడు. డల్లాస్ వేదికగా గురువారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్ పరాజయాన్ని చవిచూసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. కెంజిగె (3/30), సౌరభ్ నేత్రావల్కర్ (2/18) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. మొనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆరోన్ జోన్స్ (36 నాటౌట్; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. అయితే మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ తప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
అయితే ఈ మ్యాచ్లో 44 పరుగులు చేసిన బాబర్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 120 మ్యాచ్ల్లో బాబర్ 41 సగటు, 129 స్ట్రైక్రేటుతో 4067 పరుగులు చేశాడు. కాగా, అంతకముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 118 ఇన్నింగ్స్ల్లో 51 సగటు, 137 స్ట్రైక్రేటుతో 4038 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రోహిత్ శర్మ (4026) మూడో స్థానంలో ఉన్నాడు.