
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ను పాక్ పేసర్ హసన్ అలీ వదిలేశాడు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వేడ్.. వరుసగా మూడు సిక్సులు బాది జట్టుకు సునాయాస విజయం అందించాడు. ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. అలీ శాయశక్తులా ప్రయత్నించాడని, దురదృష్టవశాత్తు క్యాచ్ను అందుకోలేకపోయాడన్నాడు. ఈ ఓటమికి అలీ ఒక్కడినే కారణంగా చూపలేమన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో గెలవడం ఎవరికీ సాధ్యం కాదని బాబర్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మీడియాతో మాట్లాడుతూ... 'పాక్ జట్టులో హసన్ అలీ ప్రధాన బౌలర్. అతడు జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ను పట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అందుకోలేకపోయాడు. ప్రతి మ్యాచ్లో రాణించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని సార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మేమంతా అతడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటి నుంచి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోం' అని అన్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడిన అలీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
'తొలి ఇన్నింగ్స్లో అనుకున్నంత ఎక్కువ పరుగులు చేశామని అనుకున్నా. ఆసీస్ లాంటి జట్లకు అవకాశం ఇస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదు. మ్యాథ్యూ వేడ్ క్యాచ్ మిస్ చేయడమే మ్యాచ్ను మలుపు తిప్పింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టిఉంటే ఫలితం మరోలా ఉండేది. మెగా టోర్నమెంట్లో పాక్ జట్టు ఆడిన తీరు పట్ల ఒక కెప్టెన్గా సంతృప్తి చెందా. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఇకపై జరిగే టోర్నెమెంట్లో రాణిస్తాం. మనం ఎంత బాగా ఆడినప్పటికీ కొన్నిసార్లు చిన్నచిన్న తప్పిదాల మూలంగా చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆటగాళ్లంతా ఎవరి బాధ్యతను వాళ్లు సక్రమంగానే నిర్వర్తించారు. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఎప్పుడూ ఇక్కడ ఆడటం మేము ఆనందిస్తాం' అని బాబర్ తెలిపాడు.
గురువారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్ జమన్ (32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. బాబర్ ఆజమ్ (39; 5 ఫోర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. మార్కస్ స్టొయినిస్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఊహించని విజయాన్ని అందించారు.