టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ సూపర్-8కు చేరుకుంది. హ్యాట్రిక్ విజయాలతో హోరెత్తించి మరో మ్యాచ్ మిగిలుండగానే లీగ్ దశను అధిగమించింది. ఐర్లాండ్పై ఎనిమిది వికెట్ల తేడాతో, పాకిస్థాన్పై ఆరు పరుగులు, అమెరికాపై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్లన్నీ న్యూయార్క్లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగాయి. మందకొడి పిచ్పై పేసర్లకు స్వర్గధామంగా ఈ స్టేడియం నిలిచింది.
ఇక శనివారం కెనడాతో జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్కు ఫ్లోరిడాలోని లాండర్హిల్ వేదిక కానుంది. ఆ తర్వాత సూపర్-8 మ్యాచ్ల కోసం భారత్ కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంది. సూపర్-8 పోరులతో పాటు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు వెస్టిండీస్లో జరగనున్నాయి. అయితే విండీస్ పిచ్లు ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగాలని, మహ్మద్ సిరాజ్పై వేటు వేయాలని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.

జస్ప్రీత్ బుమ్రాతో పాటు అమెరికా మ్యాచ్లో నాలుగు వికెట్లతో విజృంభించిన అర్షదీప్ సింగ్ను తుదిజట్టులో కొనసాగించాలని కుంబ్లే సూచించాడు. హార్దిక్ పాండ్య మూడో పేసర్గా జట్టులో సేవలందిస్తాడని, జట్టులో మూడో స్పిన్నర్ను తీసుకోవాలని కుంబ్లే పేర్కొన్నాడు. వెస్టిండీస్లోని పిచ్లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే భారత్కు మంచిదని అభిప్రాయపడ్డాడు. బుధవారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో అర్షదీప్ నాలుగు ఓవర్లలో తొమ్మిది పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
''ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, హార్దిక్ పాండ్యతో భారత్ ఆడాలనుకుంటే జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కంటే అర్షదీప్ సింగ్ మెరుగైన ఎంపిక అవుతాడు. పాకిస్థాన్తో జరిగిన పోరులో ఆఖరి ఓవర్ వేసిన విధానం, పొట్టి ఫార్మాట్లో భిన్నమైన ప్రదేశాల్లో బంతులు సంధించే తీరుతో అర్షదీప్ సింగ్ బెటర్ ఆప్షన్గా మారాడు. అంతేగాక అర్షదీప్ ఎడమచేతి వాటం బౌలర్. ఇది జట్టు బౌలింగ్లో వైవిధ్యాన్ని తీసుకువస్తుంది. గత మ్యాచ్లో మంచి ప్రదర్శనతో అతడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు'' అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. పాకిస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరమవ్వగా అర్షదీప్ తొలి బంతికి వికెట్ తీసి 11 పరుగులే ఇచ్చాడు.