టీ20 వరల్డ్ కప్-2024లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. విజయాలతో హోరెత్తించి సూపర్-8కు అర్హత సాధించింది. శుక్రవారం ట్రిండాడ్ వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గి తదుపరి దశకు చేరింది. గ్రూప్-బీలో ఉన్న అఫ్గాన్ ఆడిన మూడింట్లో గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది. వెస్టిండీస్తో కలిసి తమ గ్రూప్ నుంచి నెక్స్ట్ లెవల్ ఫైట్కు క్వాలిఫై అయ్యింది.
మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. వికెట్ కీపర్ కిప్లిన్ (27; 32 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఫజల్లా ఫరూకీ (3/16) మూడు వికెట్లతో సత్తాచాటాడు. నవీనుల్ రెండు, నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీశారు. పపువా నలుగురు బ్యాటర్లు రనౌటవ్వడం గమనార్హం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పసికూనకు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. 17 పరగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్ టోనీ (11; 18 బంతుల్లో, 1 ఫోర్) కాస్త ప్రతిఘటించడంతో పవర్ప్లేలో పపువా 30 పరుగులు చేసింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా చేరింది. కానీ టేలెండర్ అలెయ్ (13; 19 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి కిప్లిన్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
గుల్బాదిన్ నైబ్ (49 నాటౌట్, 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అయితే అఫ్గాన్ ఛేదన సాఫీగా సాగలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఏడు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఫామ్లో ఉన్న మరో ఓపెనర్ గుర్బాజ్ (11; 7 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గుల్బాదిన్.. అజ్మతుల్లా (13; 18 బంతుల్లో, 1 ఫోర్), మహ్మద్ నబీ (16 నాటౌట్, 23 బంతుల్లో, 1 ఫోర్) స్కోరుబోర్డు ముందుకు నడిపి జట్టును విజయతీరాలకు చేర్చాడు.