క్రికెట్ ప్రపంచమంతా అఫ్గానిస్థాన్ గురించే చర్చిస్తోంది. గత టీ20 వరల్డ్ కప్లో ఒక్కమ్యాచ్ కూడా గెలవలేకపోయినా అఫ్గానిస్థాన్ ఈ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది.ఈ మెగాటోర్నీలో అండర్డాగ్స్లా బరిలోకి దిగిన అఫ్గాన్ ప్రయాణం అద్వితీయం. గ్రూప్ స్టేజ్లో ఎంతో నిలకడైన జట్టు న్యూజిలాండ్ను చిత్తు చేసింది. సూపర్-8లో స్ట్రాంగ్ టీమ్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.
ఇవన్నీ అదృష్టంతోనో గాలివాటంతో అఫ్గానిస్థాన్ సాధించలేదు. కఠోర శ్రమకు ఇది నిదర్శనం. సెమీఫైనల్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లో అఫ్గాన్ అద్భుత పోరాటం చేసింది. మ్యాచ్ను కోల్పోయే దశ నుంచి తిరిగి పోటీలోకి వచ్చింది. ఒత్తిడిలో ఎలాంటి పొరపాటు చేయకుండా ఒకే దెబ్బకు బంగ్లాదేశ్తో పాటు ఆస్ట్రేలియాను ఇంటికి పంపింది.

ఈ విజయం అఫ్గానిస్థాన్కు అత్యంత అవసరం. ఎందుకంటే తమతో సిరీస్ ఆడటానికి తిరస్కరించిన అస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లకు ఇది చెంపపెట్టులా చూపించాలని అఫ్గానిస్థాన్ కసిగా ఆడింది. అంతేగాక ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజలకు ఇదో తీయని ఔషదంగా పనిచేస్తుందని ఆశించి పోరాడింది. అందుకే బంగ్లాదేశ్పై విజయానంతరం అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కెప్టెన్ రషీద్ ఖాన్ మోకాళ్లపై కూర్చొని కన్నీటి పర్యంతమయ్యాడు. డగౌట్లో ఉన్న ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆనందభాష్పాలతో తడిసిపోయాడు. మైదానంలో అఫ్గాన్ ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. టీ20 వరల్డ్ కప్ ఇంకా సాధించనప్పటికీ సెమీస్కు అర్హత సాధించడం అఫ్గానిస్థాన్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. వరల్డ్ కప్ చరిత్రలో అఫ్గాన్ సెమీస్కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం ట్రిండాడ్ వేదికగా సౌతాఫ్రికాతో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్ ఆడనుంది.
కాగా, మొదట అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు.