టీ20 వరల్డ్ కప్లో సూపర్-8కు చేరాలనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఆవిరి అయ్యాయి. పపువా న్యూ గినియాపై అఫ్గానిస్థాన్ విజయం సాధించడంతో కివీస్ అధికారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటి రౌండ్లోనే వెనుదిరడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి. గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ తదుపరి దశకు అర్హత సాధించాయి.
శుక్రవారం ట్రిండాడ్ వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో అఫ్గానిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా 19.5 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. కిప్లిన్ (27; 32 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఫజల్లా ఫరూకీ (3/16) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గుల్బాదిన్ నైబ్ (49 నాటౌట్, 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు.

అయితే ఈ విజయంతో అఫ్గానిస్థాన్ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. టేబుల్ టాపర్గా నిలిచింది. వెస్టిండీస్ కూడా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఆడిన మూడింట్లో నెగ్గాయి. మరోవైపు న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల ఖాతా తెరవకుండా, -2.425 నెగటివ్ రన్రేటుతో పట్టికలో అట్టడుగన నిలిచింది. శుక్రవారం ఉగాండతో, సోమవారం పపునా న్యూ గినియాలతో కివీస్ తలపడనుంది.
పసికూనలతో జరిగే ఈ మ్యాచ్ల్లో న్యూజిలాండ్ ఘన విజయాలు సాధించనప్పటికీ సూపర్-8కు అర్హత సాధించలేదు. ఎందుకంటే మిగిలిన మ్యాచ్ల్లో గెలిచినా కివీస్ గరిష్ఠంగా నాలుగు పాయింట్లకే చేరుకుంటుంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ ఆరు పాయింట్లు సాధించాయి. దీంతో న్యూజిలాండ్కు గ్రూప్-సీలో టాప్లో నిలిచే దారులు మూసుకుపోయాయి. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సూపర్-8 ఆశలు ఆవిరయ్యాయి.