T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన సూపర్-8 దశకు చేరుకుంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఈ రౌండ్కు అర్హత సాధించాయి. సెమీఫైనల్ బెర్తుల కోసం ఈ 8 జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే మైదానంలో ఆటగాళ్ల పోరాటం కంటే ఇప్పుడు శ్రీలంకలోని కొలంబోలో కురుస్తున్న భారీ వర్షాలు జట్ల భవితవ్యాన్ని శాసిస్తాయేమోనన్న ఆందోళన మొదలైంది.
వర్షం పడితే రిజల్ట్ ఎలా తేలుస్తారు?
క్రికెట్ అభిమానుల మదిలో ఇప్పుడు మెదులుతున్న ప్రధాన ప్రశ్న.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఫలితం ఎలా ఉంటుంది? ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్-8 దశలో ఏదైనా మ్యాచ్కు ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5-5 ఓవర్ల పాటు ఆడటం తప్పనిసరి. వర్షం తగ్గుముఖం పడితే అంపైర్లు ఓవర్లను కుదించి అయినా మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిరంతరాయంగా వర్షం కురిసి కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే, ఆ మ్యాచ్ను అధికారికంగా 'రద్దు' చేసినట్లు ప్రకటిస్తారు.

రిజర్వ్ డే, పాయింట్ల కేటాయింపు:
సాధారణంగా ఫైనల్ లేదా సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు 'రిజర్వ్ డే' ఉంటుంది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్-8 దశలో జరిగే మ్యాచ్లకు ఎటువంటి రిజర్వ్ డే కేటాయించలేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ (1-1) మాత్రమే లభిస్తుంది. సాధారణంగా గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి, కానీ వర్షం వల్ల పాయింట్లు పంచుకోవాల్సి రావడం సెమీస్ రేసులో ఉన్న జట్లకు పెద్ద మైనస్ అవుతుంది. ముఖ్యంగా ఈ రద్దయిన మ్యాచ్ల వల్ల జట్ల 'నెట్ రన్ రేట్'పై ఎటువంటి ప్రభావం ఉండదు, పాయింట్ల పట్టికలో కేవలం ఒక పాయింట్ మాత్రమే అదనంగా చేరుతుంది.
పాక్-న్యూజిలాండ్ మ్యాచ్పై వర్షం ఎఫెక్ట్
సూపర్-8 రౌండ్ ప్రారంభంలోనే వాతావరణం తన ప్రభావాన్ని చూపింది. కొలంబోలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీనివల్ల రెండు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితం గ్రూప్ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. తదుపరి మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధిస్తే తప్ప.. ఈ జట్లు సెమీఫైనల్కు చేరుకోవడం కష్టతరంగా మారే అవకాశం ఉంది.
జట్ల సెమీఫైనల్ ఆశలపై నీళ్లు
సూపర్-8లో ప్రతి జట్టుకు కేవలం మూడు అవకాశాలు (మూడు మ్యాచ్లు) మాత్రమే ఉంటాయి. సెమీఫైనల్కు వెళ్లాలంటే గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలవడం అత్యవసరం. వర్షం కారణంగా పాయింట్లు కోల్పోవడం వల్ల, బలమైన జట్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు జట్లు ప్రత్యర్థి జట్ల కంటే ఎక్కువగా వాతావరణంపైనే దృష్టి సారిస్తున్నాయి. క్రికెట్ ప్రియులు కూడా మ్యాచ్లు సజావుగా జరగాలని.. ఫలితం మైదానంలోనే తేలాలని కోరుకుంటున్నారు.