క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద టోర్నీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్కు పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భీష్మించుకోవడంతో, ఐసీసీ (ICC) మధ్యేమార్గంగా వేదికలను మార్చే ఆలోచనలో ఉంది.
వివాదం ఎక్కడ మొదలైంది?
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తమ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేసింది. దీనికి ప్రతీకారంగా, భద్రతా సాకుతో తమ జట్టును భారత్కు పంపకూడదని బంగ్లాదేశ్ నిర్ణయించుకుంది. దీంతో షెడ్యూల్ ప్రకారం భారత్లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

సిద్ధంగా ఉన్న శ్రీలంక:
బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు వారి మ్యాచ్లను తటస్థ వేదికలకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అప్రమత్తమైంది. ఇప్పటికే పాకిస్థాన్ ఆడే మ్యాచ్లన్నింటికీ శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్లు కూడా శ్రీలంకకే దక్కే అవకాశం ఉంది.కొలంబోలోని రెండు స్టేడియాలు, పల్లెకెలెలోని ఒక స్టేడియం మ్యాచ్ల కోసం సిద్ధంగా ఉన్నాయి.అదనపు మ్యాచ్లను నిర్వహించడం పెద్ద సవాలే అయినప్పటికీ, వసతులు కల్పిస్తే తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
షెడ్యూల్లో మార్పులు తప్పవా?
బంగ్లాదేశ్ మ్యాచ్లను కొలంబో లేదా ఇతర నగరాల్లోకి సర్దుబాటు చేసేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది.ఒకవేళ బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ లేదా ఫైనల్కు చేరుకుంటే,అప్పుడు భారత్లో జరగాల్సిన ఆ కీలక మ్యాచ్లను కూడా శ్రీలంకకు తరలించాల్సి వస్తుంది.ఇది టోర్నీ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.