టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన భారీ ఓటమి టీమిండియాను ఆత్మరక్షణలో పడేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల భారత్ సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ వైఫల్యం, లెఫ్టార్మ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్లో తడబడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి తుది జట్టులో సమూల మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించాడు.
తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్?
ప్రస్తుత టోర్నీలో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. దీనిపై స్పందించిన పార్థివ్ పటేల్.. తిలక్ వర్మ స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ను తీసుకురావాలని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ సంజూను జట్టులోకి తీసుకుంటే.. అతడిని నేరుగా నంబర్ 3 స్థానంలో ఆడించాలని, అది కుదరని పక్షంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుని మూడో స్థానంలో రావాలని పార్థివ్ పేర్కొన్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సంజూ రాకతో జట్టులో వైవిధ్యం పెరుగుతుందని తెలిపాడు.

చెన్నై పిచ్.. సంజూకు కలిసొచ్చే అంశం
భారత్ తన తర్వాతి మ్యాచ్ను జింబాబ్వేతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడనుంది. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండటం ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల సంజూ శాంసన్ జట్టులోకి రావడం భారత్కు ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా చెన్నైలో శాంసన్కు ఉన్న రికార్డు కూడా అతనికి మద్దతుగా నిలుస్తోంది.
బౌలింగ్ విభాగంలోనూ మార్పుల అవసరం
బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగంలోనూ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని పార్థివ్ పటేల్ సూచించాడు. అక్షర్ గతంలో క్లిష్ట సమయాల్లో అటు బంతితో, ఇటు బ్యాట్తో జట్టును ఆదుకున్నాడని గుర్తు చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని ఎంపికలపై ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో, జింబాబ్వేపై గెలవడమే కాకుండా సెమీస్ రేసులో నిలవాలంటే టీమిండియా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది.