టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పల్లెకెలె వేదికగా నేడు జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వరుసగా మూడు పరాజయాలతో సతమతమవుతున్న ఒమన్.. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతోంది. ఈ క్రమంలో ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయ్యాయి.
'ఆస్ట్రేలియాను అణచివేస్తాం - జతీందర్ ధీమా
శుక్రవారం జరగనున్న ఈ పోరుకు ముందు జతీందర్ సింగ్ చాలా దూకుడుగా స్పందించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉందని, ఆ బలహీనతను తాము సొమ్ము చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు."ప్రస్తుతం ఆస్ట్రేలియా అత్యుత్తమ ప్రదర్శన చేయడం లేదు. వారి శిబిరంలో నైరాశ్యం కనిపిస్తోంది. వారిని ఓడించడానికి, ఇంకా చెప్పాలంటే అణచివేయడానికి ఇదే సరైన సమయం. టీ20 అనేది మొమెంటం మీద నడిచే ఆట, సరైన సమయంలో మేము పుంజుకుంటే ఏదైనా సాధ్యమే," అని ఒమన్ కెప్టెన్ జతీందర్ ధీమా వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాకు పరువు సవాల్
ఒమన్తో పోలిస్తే ఆస్ట్రేలియా చాలా బలంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత టోర్నీలో వారి ఆటతీరు అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటికే టోర్నీలో నిరాశపరిచిన ఆసీస్.. కనీసం ఈ మ్యాచ్ గెలిచి తమ గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. గత 2024 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఒమన్ పట్టుదలతో ఉంది.
ఒమన్ క్రికెట్ భవిష్యత్తుపై కెప్టెన్ సూచనలు
ఒమన్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించాలంటే తమ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్లో అవకాశాలు రావాలని జతీందర్ అభిప్రాయపడ్డారు. 2025లో ఒమన్కు తక్కువ మ్యాచ్లు లభించడం వల్ల ఇతర జట్లతో పోలిస్తే వెనుకబడ్డామని ఆయన అన్నారు. ఇతర దేశాల జట్లు ఒమన్ పర్యటనకు వచ్చి మ్యాచ్లు ఆడితే, తమ జట్టు నాణ్యత మెరుగుపడుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఆస్ట్రేలియా అనుభవం, మరోవైపు ఒమన్ కసి.. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. నిజంగానే ఒమన్ అద్భుతం చేసి ఆస్ట్రేలియాను ఓడిస్తే, అది క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద 'అప్సెట్'గా నిలిచిపోతుంది.