T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే మహాపోరును కళ్లారా చూడాలనుకునే అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15, 2026న జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ప్రారంభ ధర కేవలం ₹438 (1500 శ్రీలంకన్ రూపాయలు) మాత్రమే కావడం గమనార్హం.
ఐసీసీ చారిత్రక నిర్ణయం
భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం టికెట్ల విక్రయం గురువారం (డిసెంబర్ 12) ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ నిర్ణయం ద్వారా అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. భారతీయ వేదికల్లో జరిగే మ్యాచ్లకు టికెట్ల ప్రారంభ ధర కేవలం రూ.100 మాత్రమే. శ్రీలంకలో జరిగే మ్యాచ్లకు ప్రారంభ ధర 1000 శ్రీలంకన్ రూపాయలు. ఐసీసీ చరిత్రలో ఒక ఈవెంట్ కోసం టికెట్ల ధరలు ఇంత తక్కువగా నిర్ణయించడం ఇదే తొలిసారి. స్టేడియంలో మ్యాచ్ చూసే అనుభవాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ 2026లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ల ధరలు సైతం అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. సాధారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు లక్షల రూపాయలకు అమ్ముడవుతుంటాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ మ్యాచ్కి ఈ ధర ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.
టికెట్ బుకింగ్ విధానం: దశలవారీగా..
*టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ల టిక్కెట్లను బుక్ మై షో (Book My Show) యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
*ఖాతా సృష్టి/లాగిన్: బుక్ మై షో యాప్లో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను సృష్టించి OTP ధ్రువీకరణ పూర్తి చేయండి.
*వరల్డ్ కప్ ట్యాబ్: టాప్ నావిగేషన్ బార్లో 'వరల్డ్ కప్' ట్యాబ్ను ఎంచుకోండి.
*వేదిక ఎంపిక: మీరు మ్యాచ్ చూడాలనుకుంటున్న దేశం (ఉదా: భారత్ లేదా శ్రీలంక) లేదా వేదికను ఎంచుకోవాలి.
*బుకింగ్: భారత్ మ్యాచ్లను ఎంచుకున్నప్పుడు, టికెట్లు అందుబాటులోకి (లైవ్) వచ్చే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా వేచి ఉండాలి. ఆ తర్వాత, సీట్లను ఎంచుకుని బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి.
*M-టికెట్ వివరాలు: టికెట్లు M-టికెట్ రూపంలో ఇవ్వబడతాయి. భద్రతా కారణాల దృష్ట్యా QR కోడ్ మొదట్లో అస్పష్టంగా ఉంటుంది. మ్యాచ్ రోజుకు దగ్గరగా వచ్చినప్పుడు ఈ కోడ్ యాక్టివేట్ అవుతుంది.
టోర్నమెంట్ పూర్తి వివరాలు
టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8, 2026న జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు భారత్లో 5 వేదికల్లో (అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా), శ్రీలంకలో 3 వేదికల్లో జరుగుతాయి.డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టోర్నమెంట్ మొదటి రోజు అమెరికాతో తలపడనుంది.