T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగి మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఓ హైవోల్టేజ్ డ్రామాకు వేదికైంది. పాకిస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు ఆఖరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో విజయానికి 28 పరుగులు అవసరమైన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక విధ్వంసకర బ్యాటింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది వేసిన ఓ ఓవర్ మొదటి 4 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన షనక.. సమీకరణాన్ని 2 బంతుల్లో 6 పరుగులుగా మార్చేశాడు. శ్రీలంక విజయం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో అసలైన ట్విస్ట్ మొదలైంది.
వైడ్ బాల్ వివాదం
షాహీన్ అఫ్రిది వేసిన ఆఖరి 2 బంతులు ఆఫ్-స్టంప్కు వైడ్ లైన్ దాటి వెళ్లాయి. బ్యాటర్ పరిధికి దూరంగా ఉన్న ఆ బంతులను అంపైర్ రాడ్ టక్కర్ వైడ్లుగా ప్రకటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఆయన వాటిని 'లీగల్ డెలివరీ'లుగా పరిగణించి డాట్ బంతులుగా ప్రకటించారు. దీంతో శ్రీలంకకు రావలసిన అదనపు పరుగులతో పాటు అదనపు బంతులు కూడా లభించలేదు. రీప్లేలో ఆ బంతులు వైడ్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. అంపైర్ నిర్ణయం మార్చుకోకపోవడంతో శ్రీలంక 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మైదానంలోకి దూసుకొచ్చిన సనత్ జయసూర్య:
అంపైర్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం శ్రీలంక డగౌట్లో చిచ్చు రేపింది. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఆవేశంతో మైదానంలోకి దూసుకెళ్లారు. అంపైర్ రాడ్ టక్కర్ను నేరుగా కలిసి.. జెయింట్ స్క్రీన్పై రీప్లేలను చూపిస్తూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. స్పష్టమైన వైడ్ బంతులను ఎందుకు ఇవ్వలేదని.. ఒక అంతర్జాతీయ టోర్నీలో ఇలాంటి తప్పిదాలు ఎలా జరుగుతాయని ఆయన నిలదీశారు. జయసూర్య ఆగ్రహం చూస్తుంటే, ఆ నిర్ణయం శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలను ఎంతలా దెబ్బతీసిందో అర్థం చేసుకోవచ్చు.
డగౌట్లో విషాదం - క్రీడాభిమానుల మద్దతు:
ఓటమి అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అద్భుతమైన పోరాటం చేసినా.. అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల విజయం చేజారిందన్న బాధ షనకలో స్పష్టంగా కనిపించింది. సహచర ఆటగాడు దునిత్ వెల్లాలగే అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. ఈ విజయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంపైర్ల నాణ్యతపై మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ రేసు మరింత క్లిష్టంగా మారింది.