T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. సూపర్-8 మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం వల్ల భారత నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్లో కీలక కామెంట్స్ చేశారు.
వెస్టిండీస్ విజయంతో పెరిగిన సెమీస్ సెగ
మరోవైపు జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం భారత్ కొంపముంచింది. విండీస్ సాధించిన ఈ భారీ విజయంతో వారి రన్ రేట్ ఆకాశాన్ని తాకింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సెమీస్ చేరాలంటే ఇప్పుడు అద్భుతమే జరగాలని హర్భజన్ పేర్కొన్నారు. ఒకవేళ వెస్టిండీస్ తన తర్వాతి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. భారత్ తన రన్ రేట్ను సరిచేసుకోవడానికి జింబాబ్వేపై కనీసం 183 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందని ఆయన లెక్కలు వేశారు.

దక్షిణాఫ్రికాపైనే భారత్ ఆశలు
హర్భజన్ సింగ్ విశ్లేషణ ప్రకారం భారత్ సెమీస్ చేరాలంటే ఈ సమీకరణాలు జరగాలి. దక్షిణాఫ్రికా తన తర్వాతి రెండు మ్యాచ్ల్లోనూ (వెస్టిండీస్, జింబాబ్వేపై) విజయం సాధించాలి. అదే సమయంలో టీమిండియా తన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాలి.వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలని భారత్ కోరుకోవాలి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే.. మూడు జట్లు 4 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది, అందులో భారత్ (-3.80) చాలా వెనుకబడి ఉంది.
అసాధ్యం కాదు.. కానీ చాలా కష్టం!
"వెస్టిండీస్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే వారు ఏదైనా చేయగలరు. రన్ రేట్ విషయంలో వారు (+5.35) చాలా ముందున్నారు. సాధారణంగా టీ20ల్లో ఒక జట్టు చేసే మొత్తం పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యం (183 రన్స్) సాధించడం దాదాపు అసాధ్యం. అలా జరగకపోతే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మన రైలు మళ్లీ పట్టాలెక్కాలంటే దక్షిణాఫ్రికా తప్పకుండా వెస్టిండీస్ను ఓడించాలి" అని భజ్జీ వివరించారు.
గురువారమే కీలక పోరు
ఫిబ్రవరి 26, గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఆ మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతే సాయంత్రం భారత్, జింబాబ్వే మధ్య పోరు జరగనుంది. ఆ రోజు ఫలితాలే టీమిండియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.