T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత సెలక్టర్లు పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అయితే నిబంధనల ప్రకారం తుది జట్టులో కేవలం 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. జట్టులో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న కొందరు ఆటగాళ్లు టోర్నీ మొత్తం మైదానంలోకి దిగకుండా కేవలం రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నలుగురు ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
1.ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడే ఓపెనర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత సమీకరణాల ప్రకారం వికెట్ కీపర్-బ్యాటర్ రేసులో సంజూ శాంసన్ మొదటి ఛాయిస్గా కనిపిస్తున్నారు. టాపార్డర్లో అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యంగా మారింది.

2. రింకూ సింగ్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్కు కూడా ఈసారి మొండిచేయి తప్పకపోవచ్చు. దానికి కారణం టీమ్ బ్యాలెన్స్. లోయర్ మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఆల్ రౌండర్లు ఉండటం రింకూకు శాపంగా మారింది. వీరు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఉపయోగపడతారు కాబట్టి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసే రింకూ కంటే వీరికే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.
3. హర్షిత్ రాణా
యువ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ నుంచి మంచి ఫామ్లో ఉన్నప్పటికీ.. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ వంటి సీనియర్ బౌలర్లు ప్రధాన పేసర్లుగా ఉన్నారు. మూడో పేసర్ అవసరమైతే ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ లేదా దూబే ఆ లోటును భర్తీ చేస్తారు. ఏదైనా గాయం కారణంగా ప్రధాన బౌలర్లు దూరమైతే తప్ప హర్షిత్కు అవకాశం రాకపోవచ్చు.
4. వాషింగ్టన్ సుందర్
వాషింగ్టన్ సుందర్ ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ అయినప్పటికీ.. జట్టులో స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్థానాలు దాదాపు ఖాయం. దీనికి తోడు వరుణ్ చక్రవర్తి 'మిస్టరీ స్పిన్' కూడా తోడవ్వడంతో సుందర్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. పైగా, ప్రస్తుతం అతను గాయంతో సతమతమవుతుండటం కూడా అతని అవకాశాలను దెబ్బతీస్తోంది.
జట్టు గెలవాలంటే వ్యక్తిగత ప్రతిభ కంటే టీమ్ కాంబినేషన్ ముఖ్యమని కోచ్ గంభీర్ భావిస్తున్నారు. అందుకే ఈ స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా, మైదానంలోకి దిగే అవకాశం రాకపోవచ్చు.