టీ20 వరల్డ్ కప్-2024లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్ గ్రూప్-ఏ టేబుల్లో టాపర్గా నిలిచింది. ఆడిన రెండింట్లో విజయ ఢంకా మోగించింది. ఐర్లాండ్పై ఆల్రౌండ్షోతో సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేన పాకిస్థాన్పై బౌలర్ల అద్భుత పోరాటంతో గెలుపు తీరాలకు చేరింది. అయితే భారత్ గెలిచినప్పటికీ అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్పై టీమిండియా 119 పరుగులకే ఆలౌటైంది. మందకొడి పిచ్పై పరుగులు చేయడం బ్యాటర్లకు కష్టమే. కానీ భారత ఆటగాళ్లు వికెట్లు సమర్పించుకున్న తీరు, చేసిన ప్రదర్శనను చూస్తే ఆందోళన చెందాల్సిందే. పది ఓవర్లకు 81/3తో మెరుగైన స్థితిలో నిలిచిన టీమిండియా ఆ తర్వాతి తొమ్మిది ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.

సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె తీవ్రంగా నిరాశపరిచారు. పాకిస్థాన్పై తన పేలవ రికార్డును సూర్య కొనసాగించాడు. ఎనిమిది బంతుల్లో ఏడు పరుగులు చేసి హారిస్ రవూఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. పాక్తో జరిగిన టీ20ల్లో వరుసగా 11, 18, 13, 15, 7 రన్స్ చేశాడు. ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత నుంచి శివమ్ దూబె ప్రదర్శన తీసికట్టుగా మారింది. ప్రపంచకప్కు ఎంపికైన క్షణం నుంచి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.
టీమిండియాలో సెలక్ట్ అయిన శుభవార్త విన్న తర్వాత ఐపీఎల్లో దూబె వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడు సార్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. అత్యధిక స్కోరు 21. ఇక పాక్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది బంతుల్లో మూడు పరుగులే చేసి వెనుదిరిగాడు. స్పిన్నర్లకు పీడ కల మిగుల్చుతాడనే హైప్తో సెలక్ట్ అయిన దూబె పాక్ స్పిన్లో మాత్రం సింగిల్స్ తీయడానికి శ్రమించాడు. అంతేగాక ఫీల్డింగ్లో నిరాశపరిచాడు. ఆదిలోనే మహ్మద్ రిజ్వాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను మిస్ చేశాడు.
ఈ నేపథ్యంలో శివమ్ దూబె స్థానంలో రింకూ సింగ్ రీఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే టీమిండియాతో ఉంటున్నప్పటికీ రింకూ జట్టులో సభ్యుడు కాదు. రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే సెలక్ట్ అయ్యాడు. ఎవరైనా ఆటగాడు గాయపడితే, అతడి స్థానంలో ఎంపిక చేయడం కోసం రింకూతో పాటు శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్ను ఎంపిక చేశారు. దీంతో దూబె పేలవమైన ప్రదర్శన కొనసాగించినా రింకూ జట్టులో ఎంపిక కాలేడు. అయితే బ్యాటింగ్కు కఠినంగా ఉండే పిచ్లలో దూబె కంటే రింకూ జట్టులో ప్రభావం చూపిస్తాడని విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.