వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు మొదలవుతుందో తెలిసిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీని వచ్చే ఏడాది జూన్ 4న మొదలు పెట్టాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీతో ఐసీసీ 2024-2031 కమర్షియల్ సైకిల్ కూడా మొదలవుతుంది.
వచ్చే ఏడాది మొత్తం 26 రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. అంటే జూన్ 4న మొదలై అదే నెల 30కి ఈ టోర్నీ ముగుస్తుంది. అదే జరిగితే చాలా మంది ఆటగాళ్లకు ఇది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ సాధారణంగా మే చివరి వరకు జరుగుతుంది. అది ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ మొదలైతే ఇబ్బందే కద.

యూఎస్ఏ, వెస్టిండీస్లో ఉన్న పది వేదికల్లో ఈ మ్యాచులు జరుగుతాయట. యూఎస్ చరిత్రలో ఇలా క్రికెట్ టోర్నీ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలే యూఎస్లోని స్టేడియాల్లో ఐసీసీ బృందం ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఇక్కడ మ్యాచులు జరిగే స్టేడియాల్లో కొన్నింటికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఈ విషయంపై కూడా ఐసీసీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ డిఫరెంట్గా నిర్వహించాలని ఐసీసీ అనుకుంటోందట. మొత్తం 20 దేశాలు ఈ టోర్నీలో పోటీ పడతాయి. వీటిని ఐదేసి జట్లుతో నాలుగు గ్రూపులుగా విడగొడతారు. ఈ గ్రూపుల్లో టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. వీటిలో టాప్-2గా నిలిచిన జట్ల మధ్య సెమీఫైనల్స్ జరుగుతాయట.
ఈ మెగా ఈవెంట్తో అమెరికాలో కూడా క్రికెట్ క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు 2028లో లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా చేర్పించాలని ఐసీసీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఇక్కడ స్టేడియాలు అభివృద్ధి చేసేలా ప్లాన్ చేసింది. అందుకోసమే ఇక్కడ టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఒలింపిక్స్లో కూడా క్రికెట్ చూడొచ్చన్నమాట.