మరో 17 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య ఈసారి టీ20 ప్రపంచకప్ జరగనుంది. బరిలో దిగే జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. టీమిండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నీ అమెరికాలో ఆడనుంది.
గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా మొదటి మ్యాచ్ను ఆడనుంది. స్థానికంగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

జూన్ 9న పాకిస్థాన్తో, జూన్ 12న ఆతిథ్య జట్టు అమెరికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ న్యూయార్క్ వేదికగా జరగనున్నాయి. జూన్ 15న కెనడాతో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఫ్లోరిడా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ స్థానికంగా ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది. లీగ్ స్టేజ్లో క్వాలిఫై అయిన అనంతరం టీమిండియా సూపర్-8 దశలో అడుగుపెడుతుంది.
ఇక భారత్ కోసం ఐసీసీ స్పెషల్ ఏర్పాట్లు చేసింది. టీమిండియా సెమీఫైనల్కు చేరితే గయానాలో మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. సూపర్-8లో టాప్-4లో నిలిస్తే జూన్ 27న జరిగే సెమీస్లో భారత్ పాల్గొంటుందని చెప్పింది. జూన్ 26న ట్రినిడాడ్లో ఆరంభమయ్యే తొలి సెమీస్తో పోలిస్తే రెండో సెమీస్ను భారత కాలమానానికి అనుగుణంగా ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్ రాత్రి 8.30కు మొదలు కానుంది.
కాగా, సెమీస్కు రిజర్వ్ డే లేదు. కానీ మ్యాచ్ పూర్తి చేసేందుకు నాలుగు గంటల అదనపు సమయం ఉంటుంది. అయితే క్రికెట్ అభిమానులకు డిస్నీ హాట్స్టార్ గుడ్న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్ ప్రపంచకప్ను మొబైల్స్లో ఫ్రీగా చూడొచ్చని వెల్లడించింది. ఫోన్లో వీక్షించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్తో ఫ్రీ పోస్టర్ను హాట్ స్టార్ రిలీజ్ చేసింది. 'ఫ్రీ ఫర్ ఆల్.. హర్ మ్యాచ్ హర్ బాల్' అని క్యాప్షన్ దానికి రాసుకొచ్చింది.