మరో మూడు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టైటిల్ కోసం ఈ సారి ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. కాగా, 2007లో ఈ పొట్టి కప్ మహా సమరం తొలిసారి జరిగింది. ఆ తర్వాత ఐసీసీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు నిర్వహించింది. తొలి ట్రోఫీని ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ సాధించింది.
వెస్టిండీస్, ఇంగ్లండ్ చెరో రెండు సార్లు విజేతగా నిలిచాయి. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కసారి గెలిచాయి. అయితే టీ20 వరల్డ్ కప్లో నమోదైన అరుదైన కొన్ని రికార్డులు ఈ ప్రపంచకప్లో బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లి, మహేలా జయవర్ధనే రికార్డులు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నాయి.

అత్యధిక ఫోర్లు
టీ20 వరల్డ్ కప్లో అత్యధిక ఫోర్లు సాధించిన ప్లేయర్గా మహేలా జయవర్ధనే పేరిట రికార్డు ఉంది. జయవర్ధనే పొట్టి కప్ వేదికగా 111 బౌండరీలు సాధించాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లికి మరో తొమ్మిది ఫోర్లు మాత్రమే అవసరం. కోహ్లి 103 ఫోర్లు బాదాడు. అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (91), డేవిడ్ వార్నర్ (86) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఓ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు
టీ20 ప్రపంచకప్లో టాప్ స్కోరర్గా అత్యధిక సార్లు నిలిచిన ఆటగాడు విరాట్ కోహ్లి. 2014, 2022 వరల్డ్ కప్లలో కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఓ టీ20 కప్లో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ రికార్డు కోహ్లి పేరిటే ఉంది. 2014లో కోహ్లి సాధించిన 319 పరుగులే అత్యధికం. ఈ రికార్డు ఇప్పటివరకు చెక్కుచెదరలేదు. అయితే ఈసారి వరల్డ్ కప్లో 20 జట్లు పాల్గొననుండటంతో ఓ జట్టు గరిష్టంగా తొమ్మిది మ్యాచ్లు ఆడగలదు. దీంతో కోహ్లి 319 రన్స్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.