టీ20 వరల్డ్ కప్-2024లో ఆరంభం అదిరింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో వెస్టిండీస్ మినహా ఆడిన మిగిలిన జట్లన్నీ పసికూనలే. కానీ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అమెరికా-కెనడా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్ను పపువా న్యూ గినియా భయపెట్టింది. ఇక నమీబియా-ఒమన్ మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్కు దారితీసింది.
స్ట్రాంగ్ టీమ్స్ మ్యాచ్లు ప్రారంభంకాకపోయినా అభిమానులకు మెగాటోర్నీ సందడి మొదలైంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్ గురువారం ఆడనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. ఈ పోరులో టీమిండియా ఫేవరేట్ అయినప్పటికీ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్ని రోజులు ప్రత్యర్థుల్లా ఐపీఎల్లో తలపడిన భారత క్రికెటర్లు దేశం కోసం సమష్టిగా పోరాడనున్నారు.

కాగా, మ్యాచ్లో అందరి కళ్లు విరాట్ కోహ్లిపై ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్ తరఫున కోహ్లి చివరిగా ఆడాడు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.ఐపీఎల్ ముగిసిన అనంతరం ప్రత్యేక అనుమతితో అమెరికాకు ఆలస్యంగా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా సాగిన ఏకైక బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్కు దూరమయ్యాడు. జట్టుతో కోహ్లి ఉన్నప్పటికీ సుదీర్ఘ ప్రయాణం చేసిన కారణంగా టీమిండియా మేనేజ్మెంట్ రన్ మెషిన్కు విశ్రాంతి ఇచ్చింది.
అయితే అమెరికాలో కోహ్లి ఇప్పటివరకు సాధన మొదలుపెట్టలేదని సమాచారం. శనివారం బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ జరగడంతో భారత ఆటగాళ్లందరికీ మేనేజ్మెంట్ ఆదివారం విశ్రాంతి ఇచ్చింది. అయితే కోహ్లి ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ను పాల్గొనాలని భావించినా, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు.ఎందుకంటే న్యూయార్క్లోని నాసా స్టేడియంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆటగాళ్లు సాధన చేశారు. గ్రూప్-డీలో భాగంగా న్యూయార్క్ వేదికగా సౌతాఫ్రికా-లంక ఇవాళ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మరోసారి ప్రాక్టీస్కు దూరమయ్యాడు.
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్