క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మెగా టోర్నీ సిద్ధమైంది. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరానికి అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విడిపోయి తలపడనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్ దశ మ్యాచ్ల్నీ భారత్ యూఎస్ఏలోనే ఆడనుంది. న్యూయార్క్లోని నాసా కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో రోహిత్ సేన ఆడనుంది.

కెనడా మ్యాచ్ మినహా న్యూయార్క్ వేదికగానే భారత్ అన్ని మ్యాచ్లు ఆడనుంది. అయితే అదే వేదికగా భారత్ ఇవాళ బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడుతూ తుదిజట్టు కూర్పును సిద్ధం చేయాలని టీమిండియా భావిస్తోంది. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ వార్మప్ మ్యాచ్కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణం చేసిన కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.
గురువారం పయనమైన కోహ్లి నిన్న అమెరికాకు చేరుకున్నాడు. 'కోహ్లి హోటల్కు చేరుకున్నాడు. సుదీర్ఘ ప్రయాణం అనంతరం అతను విశ్రాంతి తీసుకుంటాడు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ ముగిసిన అనంతరం కోహ్లి ఆటకు విరామం తీసుకున్నాడు. భారత ఆటగాళ్లతో కాకుండా ఒంటరిగా యూఎస్ఏకు వచ్చాడు. ఐపీఎల్-2024లో కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. 15 మ్యాచ్ల్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.