Team India: భారత జట్టు త్వరలోనే ఒక వరల్డ్ కప్ గెలుస్తుందని లెజెండ్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియాకు చూస్తుంటే వరల్డ్ కప్ చాలా త్వరలోనే వచ్చేలా ఉందని, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా చాలా గట్టి కంటెండర్ అని తెలిపాడు.
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు ట్రోఫీకి అడుగు దూరం వరకు వచ్చి చతికిలపడింది. టోర్నీ ఆసాంతం ఎదురు లేకుండా ఆడిన టీమిండియా.. ఫైనల్లో తడబడింది. అప్పటి వరకు టోర్నీలో చెలరేగిన భారత బ్యాటర్లు.. ఫైనల్లో తమ షెల్లోకి వెళ్లిపోయారు. మూడు వికెట్లు పడగానే కోహ్లీపై మళ్లీ భారం పడింది.

దురదృష్టవశాత్తూ అతను కూడా అవుటవడంతో భారత బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. కేఎల్ రాహుల్ మరీ టెస్టు ప్లేయర్లా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్, జడేజా ఇద్దరూ దారుణంగా ఫెయిలయ్యారు. ఇక మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే భారత్కు చాలా టైం పడుతుందని మాజీలు చాలామంది అన్నారు. ఈ క్రమంలో రవిశాస్త్రి కూడా ఇదే మాట చెప్పాడు.
'భారత జట్టు చాలా త్వరలోనే వరల్డ్ ప్ గెలుస్తుందని నా నమ్మకం. అది వన్డే వరల్డ్ కప్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ట్రోఫీ నెగ్గాలంటే మళ్లీ జట్టును నిర్మించాల్సి ఉంది. కానీ టీ20 క్రికెట్లో మాత్రం భారత్ చాలా సీరియస్ ఛాలెంజర్ అనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్లో భారత్ చాలా బలంగా ఉంది. ఇప్పుడు దాని మీదనే ఫోకస్ పెట్టాలి' అని సూచించాడు.
ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా కోర్ గ్రూప్ ఫిక్స్ అయిందని రవిశాస్త్రి చెప్పాడు. కాబట్టి యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత్ చాలా గట్టి పోటీ ఇస్తుందని, గెలిచే అవకాశం కూడా ఉందని ధీమా వ్యక్తం చేశాడు.