టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ తొలి సమరానికి సిద్ధమైంది. న్యూయార్క్లోని నాసా కంట్రీ స్టేడియంలో పసికూన ఐర్లాండ్తో బుధవారం తలపడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రేపటి పోరులో టీమిండియానే ఫేవరేట్ అయినప్పటికీ ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. ఏ ఆటగాడికి అవకాశం దక్కుతుందో, ఏ ప్లేయర్పై వేటు పడుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఐపీఎల్లో విరాట్ కోహ్లి ఓపెనర్గా సంచలన ప్రదర్శన చేయడంతో ప్రపంచకప్లోనూ అదే స్థానంలో వస్తాడా? లేదా వన్డౌన్లోనే బరిలోకి దిగుతాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అయితే ఐర్లాండ్తో రేపు జరిగే మ్యాచ్లో టీమిండియా తుది జట్టును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో కేవలం ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లనే తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శివమ్ దూబెను సెలక్ట్ చేశాడు.
అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు చేశాడు. తుదిజట్టులో జైస్వాల్ దక్కించుకోవడం కష్టమని ఇటీవల గవాస్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జైస్వాల్ను మూడో స్థానంలో ఎంపిక చేశాడు. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వస్తారని తెలిపాడు. దూబె ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేలా తుది జట్టును గవాస్కర్ తీర్చిదిద్దాడు. కాగా, టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్తో భారత్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడింది. అన్నింట్లోనూ టీమిండియాదే విజయం.
సునీల్ గవాస్కర్ అంచనా వేసిన భారత తుది జట్టు:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్