టీ20 వరల్డ్ కప్లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. బార్బడోస్ వేదికగా గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20ల్లో నమీబియాపై స్కాట్లాండ్కు ఇదే మొదటి గెలుపు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కెప్టెన్ గ్రెర్హార్డ్ ఎరాస్మస్ (52; 31 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియాకు శుభారంభం దక్కలేదు. ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయిన ఆ జట్టు 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన వికెట్ కీపర్ జేన్ గ్రీన్తో కలిసి ఎరాస్మస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయిదో వికెట్కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే కాసేపటికే వికెట్ కోల్పోయాడు.

ఆ తర్వాత నమీబియా క్రమంగా వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ వీల్ మూడు, బ్రాడ్లీ రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రిచీ బెరింగ్టన్ (47 నాటౌట్; 35 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మైకేల్ లీస్క్ (35; 17 బంతుల్లో, 4 సిక్సర్లు) సత్తాచాటారు. అయితే స్కాట్లాండ్ ఛేజింగ్ అంత సాఫీగా సాగలేదు. 11 ఓవర్లలో 73 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన మైకేల్తో కలిసి రిచీ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. 16 ఓవర్లకు స్కాట్లాండ్ 116/4 స్కోరుతో నిలిచింది. విజయ సమీకరణం చివరి నాలుగు ఓవర్లలో 40 బంతులుగా మారింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే డేవిడ్ వైసే వేసిన 17వ ఓవర్లో మైకేల్ రెండు సిక్సర్లు, బెరింగ్టన్ ఒక్క ఫోర్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ స్కాట్లాండ్ వైపు మళ్లింది.
టేబుల్ టాపర్గా స్కాట్లాండ్
ఈ విజయంతో గ్రూప్-బీలో మూడు పాయింట్లతో పసికూన స్కాట్లాండ్ టేబుల్ టాపర్గా నిలిచింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా (2), నమీబియా (2), ఇంగ్లండ్ (1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఒమన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.