వరల్డ్ కప్ వేటకు అమెరికాకు వెళ్లిన భారత ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. పరిస్థితులకు అలవాటు పడుతూ నెట్స్లో చెమటోడుస్తున్నారు. జూన్ 2న ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్కు అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్-ఏలో ఉన్న భారత్ తమ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది.
గ్రూప్-ఏలో భారత్తో పాటు పాకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే న్యూయార్క్ వేదికగా రేపు బంగ్లాదేశ్తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. దీని కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మొదట ఫీల్డింగ్పై దృష్టి సారించారు. క్యాచ్ డ్రిల్స్ చేశారు. హై క్యాచ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

బుమ్రా-చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్
రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ టీ20 వరల్డ్ కప్తోనే టీమిండియాలో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగాటోర్నీకి వికెట్ కీపర్లుగా పంత్తో పాటు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. కానీ ప్రాక్టీస్లో గ్లవ్స్తో పంత్ ఎక్కువగా సాధన చేస్తూ కనిపించాడు. కాగా, నెట్స్లో బుమ్రా, చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. ఖలీల్ అహ్మద్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అవేశ్ ఖాన్ బౌలింగ్లలో ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా దూబెతో రోహిత్ చాలాసేపు మాట్లాడాడు. ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్ బంతులు సంధించాలో సూచించాడు. నిఖార్సయిన ఆల్రౌండర్గా దూబెను తీర్చిదిద్దాడానికి రోహిత్ కృషి చేస్తూ కనిపించాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత తుది జట్టులో ఫామ్లో లేని హార్దిక్ పాండ్య స్థానంలో దూబెకు అవకాశం ఇవ్వాలని రోహిత్ ప్లాన్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన శుభ్మన్ గిల్, రింకూ సింగ్ కూడా బ్యాటింగ్ సాధన చేశారు. మరోవైపు హార్దిక్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పర్యవేక్షణలో ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడు.