టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభమైంది. అమెరికా-కెనడా మధ్య జరిగిన తొలి మ్యాచే అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే భారత్ తొలి మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు ఎదురుచూడాలి. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో రోహిత్ సేననే ఫేవరేట్ అయినప్పటికీ తుదిజట్టుపైనే అందరి ఆసక్తి పెరిగింది. బ్లూ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టే 11 మంది ఎవరనే చర్చ మొదలైంది.
బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడినప్పటికీ భారత బ్యాటింగ్ ఆర్డర్పై స్పష్టత రాలేదు. రోహిత్ శర్మతో కలిసి సంజు శాంసన్ ఓపెనర్గా వచ్చాడు. వన్డౌన్లో పంత్ ఆడాడు. అసలైన మ్యాచ్ల్లో అదే తరహా బ్యాటింగ్ ఆర్డర్ ఉండదని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పష్టంగా పేర్కొన్నాడు. మరోవైపు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్ పాల్గొనలేదు. అయితే భారత తుదిజట్టు కూర్పు గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు.

యశస్వీ జైస్వాల్ను బెంచ్కే పరిమితం చేయాలని గవాస్కర్ తెలిపాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లిని ఓపెనర్గా బరిలోకి దించాలని పేర్కొన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి బ్యాటింగ్ కోసం డగౌట్లో ఎదురుచూడటం జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ''రోహిత్, విరాట్ ఓపెనర్లు. ఐపీఎల్ సెకండాఫ్లో కోహ్లి ఆడిన తీరు, ఫామ్ను చూస్తే రోహిత్తో కలిసి ఓపెనర్గా రావడానికి అతనే అర్హుడు. మంచి ప్లేయర్లు ఎప్పటికీ మంచి ప్లేయర్లే. ఏ స్థానంలో అయినా వాళ్లు బ్యాటింగ్ చేయగలరు. కుడి-ఎడమ చేతి వాటం జోడీ అవసరం లేదు''

''రైట్-లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ గురించి టీవీలో చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ అదే సరైనదని నేను భావించట్లేదు. రోహిత్, కోహ్లి అద్భుతమైన ప్లేయర్లు. సూపర్ ఫామ్తో ఐపీఎల్లో సత్తాచాటిన కోహ్లినే ఇన్నింగ్స్ ప్రారంభించాలి. జోరులో ఉన్న కోహ్లిని ఓవర్ లేదా అయిదు బంతుల వరకు డగౌట్లో ఎదురుచూసేలా చేయకూడదు. ఓపెనర్లుగా ఇతర బ్యాటర్తో కలిసి మైదానంలో అడుగుపెట్టడం భిన్నమైన అనుభూతి కలిగిస్తుంది. ఒంటరిగా రావడం కంటే భిన్నంగా ఉంటుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.