క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో రెండు రోజుల్లో మహా సమరం మొదలు కానుంది. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పొట్టి కప్ వేటలో ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
అయితే ఈ టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాళ్ల జాబితాతో తమ దేశ ప్లేయర్లే ఉంటారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, గిల్ క్రిస్ట్ జోస్యం చెప్పారు. విరాట్ కోహ్లిని కాదని ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా నిలుస్తాడని పాంటింగ్ అన్నాడు. మరోవైపు మెగాటోర్నీలో డేవిడ్ వార్నర్ లీడింగ్ స్కోరర్గా ఉంటాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుత హెడ్, వార్నర్ కంటే కోహ్లినే అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లి 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. అంతేగాక టీ20 వరల్డ్ కప్లో కోహ్లి ట్రాక్ రికార్డు సపరేటు. టీ20 కప్లో టాప్ స్కోరర్గా అత్యధిక సార్లు నిలిచిన ఆటగాడు కోహ్లినే. 2014, 2022 వరల్డ్ కప్లలో కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఓ టీ20 కప్లో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ రికార్డు కోహ్లి పేరిటే ఉంది. 2014లో కోహ్లి సాధించిన 319 పరుగులే అత్యధికం. ఈ రికార్డు ఇప్పటివరకు చెక్కుచెదరలేదు.
టీ20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లినే అత్యధిక పరుగులు సాధిస్తాడని మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మాథ్యూ హెడెన్, మహ్మద్ కైఫ్, శ్రీశాంత్ పేర్కొన్నారు. అయితే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో భారత బౌలరే నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీలు పాంటింగ్, గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. లీడింగ్ వికెట్ టేకర్గా ఫాస్ట్ బౌలర్ బుమ్రా నిలుస్తాడని పాంటింగ్, అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాపర్ అవుతాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. ఈ ఐపీఎల్ సీజన్లో బుమ్రా 13 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
కాగా, వరల్డ్ కప్ వేట కోసం విరాట్ కోహ్లి గురువారం అమెరికాకు బయలుదేరాడు. కోహ్లి మినహా భారత ఆటగాళ్లందరూ ముందుగానే యునైటెడ్ స్టేట్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ పరిస్థితులకు అలవాటు పడుతూ సాధన మొదలుపెట్టారు.