టీ20 వరల్డ్ కప్-2024 తొలిసారిగా ఓ మ్యాచ్ రద్దయింది. ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ గ్రూప్-బీ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వరుణుడు దోబుచులాడిన ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. కానీ వర్షం ధాటికి ఆటను కొనసాగించలేక మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జ్ మున్సీ (41 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మైకెల్ జోన్స్ (45 నాటౌట్; 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. అయితే టాస్ పడిన తర్వాత వెంటనే ఆటకు అంతరాయం కలిగింది. కానీ కాసేపటికే మ్యాచ్ను ప్రారంభించారు.

దూకుడుగా ఆడిన స్కాట్లాండ్ పవర్ప్లేలో 49 పరుగులు చేసింది. అయితే 6.2 ఓవర్లకు 51/0 స్థితిలో ఉన్నప్పుడు ఆటకు తొలిసారి అంతరాయం కలిగింది. దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు. కానీ మ్యాచ్ను పది ఓవర్లకే కుదించారు. స్కాట్లాండ్ 90 పరుగులు చేసినప్పటికీ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్కు లక్ష్యాన్ని 10 ఓవర్లకు 109 పరుగులుగా నిర్ణయించారు. కానీ వరుణుడి ధాటికి ఛేదన ప్రారంభంకాలేదు.
దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కడంతో గ్రూప్-బీలో టాపర్ నమీబియా నిలిచింది. గ్రూప్-బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. ఒమన్పై నమీబియా సూపర్ ఓవర్లో గెలిచి రెండు పాయింట్లు సాధించింది. కాగా, గురువారం ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 6 గంటలకు ఒమన్తో తలపడనుంది.