టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. ట్రిండాడ్ వేదికగా ఉగాండతో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ ఆలస్యంగా గెలుపు బాట పట్టింది. మొదట బంతితో, తర్వాత బ్యాటుతో చెలరేగి ఉగాండపై రికార్డు గెలుపు నమోదుచేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఉగాండ 18.4 ఓవర్లలో 40 పరుగులకు ఆలౌటైంది. కెన్నెత్ వైస్వా (11; 18 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. సౌథి (3/4) మూడు, బౌల్ట్ (2/7) శాంట్నర్ (2/8), రచిన్ రవీంద్ర (2/9) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఉగాండను బౌల్ట్ తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు.

ఓపెనర్ సైమన్ను, వన్డౌన్లో వచ్చిన రాబిన్సన్ను బౌల్ట్ గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఉగాండ క్రమంగా వికెట్లు కోల్పోయింది. 15 పరుగులకే సగం వికెట్లు, 26 పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకుంది. దీంతో టీ20ల్లో తమ స్వల్ప స్కోరు 39 రికార్డు బద్దలయ్యేలా అనిపించింది. కానీ అచెలమ్ (9; 13 బంతుల్లో)తో కలిసి కెన్నెత్ జట్టు స్కోరును 40 పరుగులకు చేర్చాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది.
అయితే న్యూజిలాండ్ స్వల్ప ఛేజింగ్ను స్లోగా పూర్తిచేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (9; 17 బంతుల్లో, 1 ఫోర్) నిదానంగా ఆడాడు. రియాజత్ బౌలింగ్లో వికెట్కీపర్ అచెలమ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (22 నాటౌట్; 15 బంతుల్లో, 4 బంతుల్లో) దూకుడుగా ఆడి జట్టును పవర్ప్లేలోపే గెలిపించాడు. టోర్నీ ఆరంభంలో అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ చేతిలో న్యూజిలాండ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.
అయితే అఫ్గాన్, వెస్టిండీస్ చెరో ఆరు పాయింట్లు సాధించడంతో కివీస్ సూపర్-8 దారులు మూసుకుపోయాయి. సోమవారం పపువా న్యూ గినియాతో జరగనున్న తమ చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచినప్పటికీ గరిష్టంగా నాలుగు పాయింట్లకే చేరుకుంటుంది. దీంతో కివీస్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.