టీ20 వరల్డ్ కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా మంగళవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. స్వల్ప స్కోరు నమోదైనప్పటికీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. నేపాల్ బంతితో గొప్పగా పోరాడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్.
నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి నేపాల్ ఆది నుంచి క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ ఆషిప్ షేక్ (4; 8 బంతుల్లో, 1 ఫోర్), కుశాల్ (7; 10 బంతుల్లో, 1 ఫోర్) పెవిలియన్కు చేరారు. పవర్ప్లేలో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగాఆడిన నేపాల్ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో నేపాల్ 100 పరుగుల మార్క్ అందుకునేలా కనిపించలేదు.

కానీ కెప్టెన్ రోహిత్ ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరోవైపు స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. నేపాల్ బ్యాటర్లలో నలుగురు మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరు అందుకోలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ (3/18), టిమ్ ప్రింగిల్ (3/20) చెరో మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ (2/19), బాస్ డీలీడె (2/22) తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
మ్యాక్స్ ఒడౌడ్ (54 నాటౌట్; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకం సాధించాడు. విక్రమ్జీత్ సింగ్ (22; 28 బంతుల్లో, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే ఛేదన ఆరంభంలోనే నెదర్లాండ్స్ ఓపెనర్ లెవిట్ (1; 3 బంతుల్లో) వికెట్ కోల్పోయింది. వన్డౌనల్లో వచ్చిన విక్రమ్జీత్తో కలిసి ఒడౌడ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వీరిద్దరు రిస్క్ తీసుకోకుండా ఆడటంతో రన్రేటుతో ఆరు లోపే కొనసాగింది.
మరోవైపు నేపాల్ బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను చివరి వరకు కొనసాగించారు. నెదర్లాండ్స్ గెలుపుకు 2 ఓవర్లలో 13 పరుగులు అవసరమైన స్థితిలో మాక్స్ ఒడౌడ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర సింగ్, అభినష్ తలో వికెట్ తీశారు.