Rohit Sharma - Virat Kohil: ఇటీవలే వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు అందరి ఆలోచనలు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ మీదనే ఉన్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న భారత జట్టు అసలు వన్డే వరల్డ్ కప్ గెలవాల్సింది. కానీ ఫైనల్లో తడబడి ఓటమి పాలైంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ కచ్చితంగా గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అయితే ఈ వరల్డ్ కప్లో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? అని తెగ చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరూ కూడా వన్డే వరల్డ్ కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లీ మొత్తం 11 మ్యాచుల్లో 765 పరుగులతో వరల్డ్ కప్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 597 పరుగులతో రోహిత్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

వీళ్లిద్దరూ కూడా అద్భుతమైన సగటు, స్ట్రైక్ రేటుతో ఈ టోర్నీలో చెలరేగారు. కానీ గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్కు వీళ్లిద్దరూ దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఫార్మాట్లో వీళ్లిద్దరి భవితవ్యంపై చర్చ మొదలైంది. దీనిపై తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. వీళ్లిద్దరి భవితవ్యంపై ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోలేమని పీటర్సన్ అన్నాడు.
'కోహ్లీ, రోహిత్ ఇద్దరికీ అవకాశం ఉంది. అయితే వాళ్లు ఐపీఎల్లో ఎలా ఆడతారనేది చూడాలి. ఐపీఎల్లో వాళ్ల ఆటతీరు చూడటం ముఖ్యం. ఎందుకంటే వాళ్లిద్దరూ కూడా భారత క్రికెట్కు ఎంతో సేవ చేశారు. ఆ గౌరవం వాళ్లకు ఇవ్వాలి కదా. అందుకే వాళ్ల ఫామ్ చూసి, వాళ్లకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలి. వాళ్లిద్దరూ కూడా సూపర్ క్రికెటర్లే' అని పీటర్సన్ కితాబిచ్చాడు.